టాలీవుడ్ మేలుకోకుంటే కొంప కొల్లేరే

కొవిడ్ దెబ్బకు అత్యంత దారుణంగా దెబ్బ తిన్న ఇండస్ట్రీల్లో సినీ పరిశ్రమ ఒకటి. ఆర్నెల్లకు పైగా థియేటర్లు మూత పడి ఉండటం, సినీ రంగంలో పనులు ఆగిపోవడం వల్ల జరిగిన నష్టం ఒకెత్తయితే.. ప్రేక్షకులకు కుటుంబాలతో థియేటర్లకు వచ్చే అలవాటు తప్పడం, వాళ్లు ఓటీటీలకు అలవాటు పడిపోవడం వల్ల జరిగిన నష్టం మరో ఎత్తు.

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లాంటి బిగ్ టికెట్ ఫిలిమ్స్, విజువల్‌గా చాలా ప్రత్యేకంగా ఉండి, థియేటర్లలో మాత్రమే చూడాలి అనిపించే సినిమాలకు మాత్రమే మెజారిటీ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద స్టార్లు నటించినా సరే.. వేరే సినిమాల కోసం థియేటర్లకు వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితి తలెత్తింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ఏం చేయాలో చూడకుండా.. టికెట్ల ధరలను పెంచుకుని కొవిడ్ నష్టాలు పూడ్చుకోవాలని, ఆదాయం పెంచుకోవాలని చూడటం మొదటికే మోసం తెచ్చినట్లు కనిపిస్తోంది.

ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా.. తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో 100, మల్టీప్లెక్సుల్లో 150 టికెట్ రేట్ ఉండేది. అలాంటిది ఇప్పుడు ఈ రేట్లు ఇప్పుడు రూ.150-175, రూ.295కు పెరిగిపోయాయి. ఈ రేట్లే చాలా ఎక్కువ అన్నది ప్రేక్షకుల అభిప్రాయం. సౌత్ ఇండియాలో అత్యధిక రేట్లున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కేసింది ఈ రేట్లతోనే. అలాంటిది పెద్ద సినిమాలకు దీని మీద 50 దాకా రేట్ పెంచుతున్నారు తొలి పది రోజులు. ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలతో కలిపితే సింగిల్ స్క్రీన్లలో రూ.250, మల్టీప్లెక్సుల్లో రూ.400 అవుతోంది టికెట్. సినిమా బాగుందన్నా కూడా ఈ రేటు పెట్టి చూడటానికి సగటు ప్రేక్షకుడు ఆలోచిస్తాడు.

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి విజువల్ బ్రిలియన్స్ ఉన్న సినిమాలకు కూడా తిట్టుకుంటూనే ఈ రేట్లతో చూశారు. అలాంటిది మామూలు సినిమాలకు, పైగా టాక్ బాగా లేకుంటే ఈ రేట్లతో థియేటర్లకు వెళ్తారా అన్నది ఆలోచించాలి. ఒకప్పుడు రేట్లు తక్కువ ఉంటే ఒక సినిమాను మళ్లీ మళ్లీ చూసేవారు. రిపీట్ ఆడియన్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండేవారు. అలాగే ఫ్యామిలీస్ బాగా సినిమాలు చూసేవి. కానీ ఇప్పుడు అంత రేటు పెట్టి మళ్లీ థియేటరుకు వెళ్లాలని ఎవరికనిపిస్తుంది.

నలుగురు సభ్యులున్న కుటుంబం క్యాంటీన్ ఖర్చులతో కలిపితే సింగిల్ స్క్రీన్లలో రూ.1500, మల్టీప్లెక్సుల్లో రూ.2500 వరకు ఖర్చవుతోంది. ఇంత పెట్టి సినిమాలు చూడటం సినిమాకు మహరాజపోషకులైన మధ్య తరగతి వారికి కచ్చితంగా భారమే. అందులోనూ ఓటీటీల్లో మూణ్నాలుగు వారాలకు కొత్త సినిమాలు అందుబాటులోకి వస్తున్నపుడు, నేరుగా కొత్త చిత్రాలే వాటిలో రిలీజవుతున్నడపు ఇంత రేటు పెట్టి సినిమా చూడటానికి ఆసక్తి ఉంటుందా? అందుకే ఆచార్య, సర్కారు వారి పాట లాంటి భారీ చిత్రాలకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. తొలి రోజు, తొలి వీకెండ్లో కూడా హౌస్ ఫుల్స్ పడని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టికెట్ల రేట్లు సాధారణ స్థాయిలోనే తగ్గించడం, తొలి పది రోజులు ఇంకా రేట్లు పెరగకుండా చూడటం అత్యవసరం. లేకుంటే ఇండస్ట్రీ మున్ముందు సంక్షోభంలో పడటం ఖాయం.