ఇంకో మూడు రోజుల్లో తండేల్ విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత పెద్ద సినిమా ఇదే కావడంతో బయ్యర్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే చాలా థియేటర్లు ఫీడింగ్ లేక అలో లక్ష్మణా అంటున్నాయి. డాకు మహారాజ్ కు ఫైనల్ రన్ కు దగ్గరపడింది. గేమ్ చేంజర్ సెలవు తీసేసుకుంది.
ఆ తర్వాత రెండు వారాల్లో వచ్చిన కొత్త రిలీజులు ఏవీ కనీస వసూళ్లను తేలేకపోయాయి. అందుకే తండేల్ మీద గంపెడాశలు పెట్టుకున్నారు. భీభత్సమైన అంచనాలు లేవు కానీ ప్రమోషన్లు చూసిన ప్రేక్షకుల్లో దీని పట్ల బజ్ పెరిగిన మాట వాస్తవం. ఇక బిజినెస్ కోణాల మీద ఓ లుక్ వేద్దాం.
ట్రేడ్ టాక్ ప్రకారం తండేల్ తెలుగు రాష్ట్రాల వరకు 40 కోట్ల దాకా బిజినెస్ చేసినట్టు సమాచారం. అంటే దీనికి రెట్టింపు మొత్తంలో గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. ఇది అసాధ్యం కాదు. ఎందుకంటే పాజిటివ్ టాక్ వస్తే ఆడియన్స్ మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. ఏపీలో కేవలం 50 రూపాయల టికెట్ రేట్ పెంపుకి ఆప్లై చేసుకోవడం ప్రతికూలంగా మారకపోవచ్చు.
ఎందుకంటే ఇలా పెంచినా కూడా ఆంధ్రప్రదేశ్ మల్టీప్లెక్స్ టికెట్ 227 రూపాయలు అయితే నైజామ్ లో ఎలాంటి పెంపు లేకుండానే ప్రభుత్వ అనుమతి ప్రకారం గరిష్ట ధర 295 రూపాయలు. సింగల్ స్క్రీన్ ధరల్లో కూడా ఇంతే వ్యత్యాసం ఉంటుంది.
సో ఇప్పుడు కావాల్సిందల్లా తండేల్ బాగుందనే మాట జనం నుంచి రావడం. బడ్జెట్ వంద కోట్ల దాకా పెట్టినప్పటికీ నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా సగం సమకూరడంతో నిర్మాతలు బన్నీ వాస్, అల్లు అరవింద్ లు ఓవర్ ప్రైసింగ్ కు వెళ్లకుండా మంచి మొత్తాలకు సినిమాను అమ్ముతున్నారు.
అధిక శాతం ఏరియాలు స్వంతంగా రిలీజ్ చేయడం చూస్తుంటే కంటెంట్ మీద ఏ స్థాయిలో నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. నాగచైతన్య కెరీర్ బెస్ట్ అవ్వడమే కాక ఈ ఏడాదిలో వచ్చిన మూడో బ్లాక్ బస్టర్ గా కలెక్షన్లు నమోదు చేయడం ఖాయమని ధీమాగా ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సాయిపల్లవి పెర్ఫార్మన్స్ దన్నుగా నిలుస్తున్నాయి.