ప్రభాస్ & తారక్…ఇద్దరినీ బ్యాలన్స్ చేస్తున్న మైత్రి

ఒక సమయంలో ఒక ప్యాన్ ఇండియా మూవీని నిర్మించడానికే నిర్మాతలు కిందా మీదా పడుతున్న రోజులివి. ఏ మాత్రం ఆలస్యం జరిగినా లేదా పరిస్థితులు అనుకూలించకపోయినా బడ్జెట్ అంతకంతా పెరిగిపోయి క్లిష్టమైన పరిస్థితులు ఎదురుకోవాల్సి ఉంటుంది. ఇటీవలే గేమ్ ఛేంజర్ రూపంలో దిల్ రాజుకిది అనుభవమే.

అలాంటిది ఏకాకాలంలో రెండు టాలీవుడ్ ప్రెస్టీజియస్ చిత్రాలను తెరకెక్కిస్తే ఆ ఒత్తిడి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టం. కానీ మైత్రి మూవీ మేకర్స్ దాన్ని తట్టుకుని మరీ ప్రాజెక్టులు తెరకెక్కిస్తోంది. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఫౌజీ కీలక దశకు చేరుకుంది.

రేపటి నుంచి కొత్త షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నారు. స్వాతంత్రం రాకముందు నేపధ్యాన్ని అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ల రూపంలో సృష్టించి చిత్రీకరణ చేస్తున్నారు. ఇంతకు ముందు భాగాలు ఇక్కడే షూట్ చేశారు. సైనికుడిగా ప్రభాస్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని, ఎమోషనల్ ప్రేమకథతో బాట దేశభక్తి అంశాలు మెండుగా ఉంటాయట.

ఇక జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందే సినిమాని ఇదే నెలలలో షురూ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలుత తారక్ లేని ఎపిసోడ్లను షూట్ చేస్తారని వినికిడి. కెజిఎఫ్, సలార్ ని మించిన సరికొత్త ప్రపంచాన్ని నీల్ సృష్టించాడని టాక్.

సో విడుదల తేదీలు ఇంకా నిర్ధారణ కాకపోయినా ఈ రెండు సినిమాలు ఏడాది లోపే వచ్చేలా దర్శకులు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎంత వరకు సాధ్యమవుతోందో ఖచ్చితంగా చెప్పలేం కానీ ప్లానింగ్ అయితే దానికి అనుగుణంగా చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ నీల్ 2026 సంక్రాంతి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫౌజీని వచ్చే ఏడాది వేసవికి టార్గెట్ అంటున్నారు.

ఇవి కాకుండా రాబిన్ హుడ్ విడుదల, ఉస్తాద్ భగత్ సింగ్ బ్యాలన్స్ షూట్, గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ రిలీజ్ లాంటి బోలెడు పనులు మైత్రి ముందున్నాయి. పుష్ప 2 ది రూల్ ఇచ్చిన ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ ఆనందం ఈ బ్యానర్ కి నింపిన జోష్ అంతా ఇంతా కాదు.