హనుమాన్ బ్లాక్ బస్టర్ రిలీజై ఏడాది దాటేసింది. ఇప్పటిదాకా దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా మొదలుకాలేదు. జై హనుమాన్ ప్రకటన వచ్చింది కానీ రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 పూర్తి చేసుకుని వస్తే తప్ప ఇది మొదలయ్యే అవకాశాలు ఇప్పట్లో లేవు. సో చాలా టైం పడుతుంది.
ఈలోగా ఇతర దర్శకులతో తన సినిమాటిక్ యునివర్స్ కింద సినిమాలు అనౌన్స్ చేస్తున్న ప్రశాంత్ వర్మ తన డైరెక్షన్ మాత్రం సస్పెన్స్ లోనే పెడుతున్నాడు. ఆ మధ్య నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం తాలూకు అనౌన్స్ మెంట్, ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చాయి కానీ తీరా మొదలుపెట్టే సమయానికి అనూహ్య కారణాల వల్ల ఆగిపోయింది.
ఇదంతా జరిగి రెండు నెలలవుతున్నా ఎలాంటి అప్డేట్ లేదు. ఇటీవలే పద్మభూషణ్ పురస్కారం దక్కించుకున్న బాలకృష్ణ కుటుంబంతో కలిసి సెలబ్రేషన్స్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. దీనికి టాలీవుడ్ నుంచి పలువురు నిర్మాతలు, దర్శకులు హాజరయ్యారు. వాళ్లలో ప్రశాంత్ వర్మ కూడా ఉన్నాడు.
తన స్పీచ్ లో భాగంగా మాట్లాడుతూ అన్ స్టాపబుల్ ప్రోమో షూట్ లో గుర్రపు స్వారీ చేస్తూ బాలయ్య తీసుకున్న రిస్క్ గురించి వివరించాడు తప్పించి మోక్షజ్ఞ సినిమా గురించి ఎలాంటి మాట రాకుండా జాగ్రత్త పడ్డాడు. త్వరలోనే బాలకృష్ణతో సినిమా తీయబోతున్నట్టు చూచాయగా చెప్పి నిమిషంలోపే ముగించాడు.
దీన్ని బట్టి ప్రశాంత్ వర్మ, నందమూరి హీరో కలయికలో సినిమా ఎప్పుడు ఉంటుందనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇదే పార్టీలో మోక్షజ్ఞ కూడా పాల్గొన్నాడు కానీ ఎంట్రీకి సంబంధించిన టాక్స్ ఏమైనా జరిగాయో లేదో అక్కడ పాల్గొన్న వాళ్ళు మాత్రమే చెప్పగలరు.
ఇన్ సైడ్ టాక్ అయితే బాలయ్య గురించి తప్ప ఇతర విషయాలు ఏవీ ప్రస్తావనకు రాలేదట. ప్రస్తుతం అఖండ 2 తాండవం చేస్తున్న బాలకృష్ణ ఆ తర్వాత వీరసింహారెడ్డి ఫేమ్ గోపీచంద్ మలినేనితో మరోసారి చేతులు కలపబోతున్నాడు. జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లొచ్చు. వీళ్ళిద్దరూ స్టేజి మీద ఉన్నప్పుడు ఈ ప్రస్తావన రావడం గమనార్షం.