సుబ్బులక్ష్మి మరోసారి వార్తల్లోకెక్కింది

సుబ్బలక్ష్మి అని తమిళనాడులో మంచి పాపులారిటీ ఉన్న అమ్మాయి. ఆమెకు ఆ పాపులారిటీ తెచ్చింది టిక్ టాక్. అందులో ‘రౌడీ బేబీ’ పేరుతో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించిందా అమ్మాయి. రౌడీ బేబీ అనగానే ధనుష్, సాయిపల్లవి డ్యాన్స్ అదరగొట్టిన పాటే కాదు.. ఈ అమ్మాయి కూడా గుర్తుకొస్తుంది తమిళ జనాలకు. అంతగా టిక్ టాక్‌తో ఆమె పాపులర్. ఐతే ఈ అమ్మాయి ఇటీవల ఒక రాంగ్ న్యూస్‌తో వార్తల్లో నిలిచింది.

ఈ మధ్యే సుబ్బులక్ష్మి సింగపూర్‌కు వెళ్లి వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన వాళ్లందరూ తమ ఆరోగ్య స్థితిని ప్రభుత్వానికి తెలియజేయడం, కరోనా పరీక్షలకు హాజరు కావడం తప్పనిసరి. కానీ సుబ్బులక్ష్మి ఆ పని చేయలేదు. ఐతే స్థానికులు ఈ విషయం గుర్తించి అధికారులు ఫిర్యాదు చేశారు. వాళ్లొచ్చి ఆమెను కరోనా పరీక్షల కోసం బలవంతంగా తీసుకెళ్లారు.

ఐతే పరీక్షా కేంద్రం దగ్గరికి వెళ్లాక సుబ్బులక్ష్మి మామూలు హంగామా చేయలేదు. నేనెవరో.. నా పాపులారిటీ ఏంటో తెలుసా.. పరీక్ష చేయడానికి ఏసీ గది దొరకలేదా.. నన్ను మామూలు గదిలో పెడతారా అంటూ అధికారులపై విరుచుకుపడింది. దీన్నంతా వీడియోలో రికార్డ్ చేయబోతున్న విలేకరిని బూతులు తిట్టింది. అతను సదరు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాదు.. ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు కూడా. దీంతో సుబ్బులక్ష్మి బాగా అన్‌పాపులర్ అయింది. అందరూ ఆమెను తిట్టుకున్నారు.

ఇంతకుముందు సుబ్బులక్ష్మి చేసిన టిక్‌టాక్ వీడియోలు హల్‌చల్‌ చేసేవి. కానీ ఇప్పుడు ఆమె కరోనా టెస్ట్ సెంటర్లో చేసిన హంగామాకు సంబంధించిన వీడియో టిక్‌టాక్‌లో వైరల్ అయింది. అందరూ ఆమెను తిట్టడం, కామెడీ చేయడం మొదలుపెట్టారు. దీంతో సుబ్బులక్ష్మి బాగా హర్టయింది. ప్రాణాలే తీసుకోవాలనుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోబోతుంటే ఎవరో చూసి కాపాడారు. ఆసుపత్రికి తరలించారు. దీంతో సుబ్బులక్ష్మి మరోసారి వార్తల్లోకెక్కింది. టిక్‌టాక్ పాపులారిటీ చూసుకుని ఏదో ఊహించుకుని అతి చేయొద్దనడానికి ఈ ఉదంతం ఉదాహరణ.