మ‌హేష్ డైలాగ్.. పెద్ద చ‌ర్చే

నేను విన్నాను నేను ఉన్నాను.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కొత్త సినిమా స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్లో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన డైలాగ్ ఇది. ట్రైట‌ర్లో కొన్ని పేలిపోయే డైలాగ్స్ ఉన్న‌ప్ప‌టికీ.. అంద‌రూ దీని గురించే ఇప్పుడు చ‌ర్చించుకుంటున్నారు. ఇదేమీ కొత్త డైలాగ్ కాదు. ఒక సినిమాలో ఉన్న‌దే. ఆ సినిమా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన యాత్ర కావ‌డం గ‌మ‌నార్హం. అందులో వైఎస్ అభిమానుల‌కు బాగా ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట‌యిన డైలాగ‌ది.

ఐతే ఇప్పుడు మ‌హేష్ ఆ డైలాగ్‌ను అనుక‌రించ‌డంలో ఉద్దేశం ఏంట‌న్న‌దే చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌హేష్ త‌న పాత చిత్రాల్లోని డైలాగ్‌నో, ఇంకేదైనా పెద్ద సినిమాలోని డైలాగ్‌నో అనుక‌రించి ఉంటే అదొక పంచ్ లాగా అనిపించేది. కానీ యాత్ర లాంటి సీరియ‌స్ సినిమాలోని ఎమోష‌న‌ల్ డైలాగ్‌ను ప‌ల‌క‌డం వేరే ఉద్దేశాలను ఆపాదించేలా చేస్తోంది. ఇది ఎంట‌ర్టైన్మెంట్ కోణంలో పెట్టిన డైలాగ్ లాగా లేదు.

ప్ర‌స్తుత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని మెప్పించ‌డం కోస‌మే మ‌హేష్ ఈ డైలాగ్ ప‌లికాడేమో అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏపీలో టికెట్ల రేట్ల త‌గ్గింపుతో ఇండ‌స్ట్రీ బాగా ఇబ్బంది ప‌డుతున్న టైంలో చిరంజీవితో క‌లిసి వెళ్లి జ‌గ‌న్‌ను క‌లిసి స‌మ‌స్య ప‌రిష్కారానికి చొర‌వ చూపిన వ్య‌క్తుల్లో మ‌హేష్ ఒక‌డు. ఐతే ఇది జ‌రిగాక కూడా పెద్ద సినిమాల‌కు అద‌నంగా రేట్లు పెంచుకునేందుకు అనుమ‌తి ఇవ్వ‌డంలో సినిమాకో ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది జ‌గ‌న్ స‌ర్కారు.

వాస్త‌వానికి చిత్ర బృందంలోని ముఖ్య వ్య‌క్తుల పారితోష‌కాలు కాకుండా వంద కోట్ల బ‌డ్జెట్ ఉన్న చిత్రాల‌కే రేట్లు పెంచుకునేలా నిబంధ‌న‌లు రూపొందించారు. కానీ ఆచార్య ఆ కేట‌గిరీలోకి రాకున్నా.. జ‌గ‌న్‌తో చిరుకున్న సాన్నిహిత్యం దృష్ట్యా దానికి సౌల‌భ్యం క‌ల్పించారు. ఇప్పుడు స‌ర్కారు వారి పాట‌కు ఆ ఆఫ‌ర్ ఉంటుందా ఉండ‌దా అన్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది. ఇది కూడా ఆచార్య లాగే ఆ కేట‌గిరీలోకి రాదు. ఇలాంటి టైంలో జ‌గ‌న్‌ను మెప్పించ‌డానికే మ‌హేష్ ఈ డైలాగ్ ప‌లికి టికెట్ల ఆఫ‌ర్ తెచ్చుకోబోతున్నాడేమో అని కౌంట‌ర్లు ప‌డుతున్నాయి సోష‌ల్ మీడియాలో.