మరో వివాదంలో బాపట్ల ఎంపీ

నిత్యం వివాదాల్లో నానటం బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కు బాగా అలవాటై పోయినట్లుంది. ఏదో ఒక వివాదంలో ఆయన పేరు జనాల్లో నానుతూనే ఉంది. పోలీసులను నోటికొచ్చినట్లు తిట్టారనో, పొరుగు వాళ్ళతో గొడవ పడ్డారనో, లేకపోతే ఇసుక దందాలో పార్టీ వాళ్ళతో గొడవపడ్దారనో ఇలా ఏదోక గొడవలో ఎంపీ పేరు వివాదాల్లో నానుతునే ఉంది. తాజాగా తాడేపల్లిలోని ప్రకాశ్ నగర్ కు చెందిన పిచ్చయ్య ఎంపీపై ఆరోపణలు చేయటంతో కలకలం మొదలైంది.

తన ఇంటిని సురేష్ చెల్లెలు కబ్జా చేసినట్లు పిచ్చయ్య అనే వ్యక్తి చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పిచ్చయ్య దంపతులు చంద్రబాబును కలిసి తమకు అన్యాయం జరిగినట్లు భోరుమన్నారు. ఎంపీ సోదరిపైన తాను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవటం లేదన్నారు. తాను అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న సమయంలో సురేష్ సోదరి మనుషులు తనింట్లోకి అక్రమంగా ప్రవేశించి తమ సామానంతా రోడ్డున పడేసినట్లు కన్నీటిపర్యంతమయ్యారు.

ఎప్పుడో చనిపోయిన తండ్రి వాళ్ళకు ఆస్తులు రాసినట్లు దొంగ పత్రాలు సృష్టించినట్లు చెప్పారు. సంబంధంలేని వాళ్ళకు తన తండ్రి తమ ఆస్తిని ఎందుకు రాసిస్తారో అర్ధం కావటం లేదన్నారు. పేదల ఇళ్ళు ఎక్కడున్నాయో పసిగట్టడం, ఏదో రూపంలో వాటిని కబ్జా చేయటం తర్వాత సొంతం చేసుకోవటమే పనిగా పెట్టుకున్నట్లు ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయంపై ఎవరి దగ్గరకు వెళ్ళి చెప్పుకున్నా న్యాయం జరగటం లేదని మొత్తుకున్నారు.

నిజానికి నందిగం సురేష్ ఎంపీ కాకముందు ఎవరికీ తెలీదు. అప్పట్లో రాజధాని ప్రాంతంలో పంటలు తగలబడిన ఘటనలో మొదటిసారి సురేష్ వెలుగులోకి వచ్చారు. తర్వాత నుంచి వైసీపీకి గట్టి మద్దతుదారుడిగా చేసిన పోరాటాల కారణంగా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడటం, బాపట్ల ఎంపీగా టికెట్ రావటం, గెలవటం అన్నీ చాలా స్పీడుగా జరిగిపోయింది. 

ఎప్పుడైతే ఎంపీగా గెలిచారో అప్పటినుండో వివాదాలు మొదలయ్యాయి. తరచూ పోలీసులతో గొడవలు, వైరివర్గంతో గొడవలు, పార్టీలోనే తాడేపల్లి ఎంఎల్ఏ ఉండవల్లి శ్రీదేవితో గొడవలు ఇలా ఆయన పేరు వివాదాల్లో నానుతునే ఉంది. మరి ఈ వివాదాలకు ఎప్పుడు ఫులిస్టాప్ పడుతుందో ఏమో.