కోర్టు బోనులో బిగ్ బాస్? 

స‌మాజంలో ఇత‌రుల గురించి ప‌ట్టించుకోక‌పోతే భ‌విష్య‌త్ లో మ‌న‌కు ఏదైనా స‌మ‌స్య ఎదురైన‌ప్పుడు ఇత‌రులు మ‌న‌ల్ని ప‌ట్టించుకోరు… అని అంటోంది ఏపీ హై కోర్టు. ఇదే ఇప్పుడు చ‌ర్చ‌కు తావిస్తోంది. ఇత‌రుల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం ఎప్ప‌టి నుంచో ఉంది కానీ మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న ఉన్నా, అనైతిక‌త ఉన్నా కూడా ప‌ట్టించుకోక‌పోవ‌డం అన్న‌ది ఇప్పుడొక  నిర్ల‌క్ష్య వైఖ‌రికి
ద‌ర్ప‌ణం పడుతోంది. బిగ్ బాస్ వ‌ద్దు అని ఎన్నో సార్లు ఎంతో మంది మొత్తుకున్నా ఛానెళ్లు ఆగ‌డం లేదు. వీటికి వ‌చ్చే హోస్టులు భారీ రెమ్యున‌రేష‌న్లు తీసుకుని ఛానెళ్ల టీఆర్పీని పెంచేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతున్నారు.

నాగార్జున కానీ తార‌క్ కానీ ఇలాంటి హీరోలు అంతా బిగ్ బాస్ షో రేంజ్ ను పెంచారు. త‌ద్వారా అగ్ర క‌థానాయ‌కుల ప్ర‌భావం చాలా ఉంది ఈ షో పై !
పోనీ బిగ్ బాస్ ఏమ‌యినా జీవితాల‌ను మార్చేస్తుంది. ఈ షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే విజేత‌లు ఏమ‌యినా క్ష‌ణం తీరుబాటు లేకుండా అవ‌కాశాలు అందుకుంటున్నారా అంటే అదీ లేదు. కానీ ఈ షో కార‌ణంగా  ఎన్నో ఆర్మీలు పుట్టుకు వ‌చ్చాయి. ఎంతో డ్రామా న‌డిచింది. ఎన్నో కోట్ల రూపాయ‌ల వ్యాపారం ఈ షో ను ఆనుకునే జ‌రిగింది కానీ దీనిని ఆప‌డం ఎవ్వ‌రి త‌రం కాలేదు.

ఆఖ‌రికి షో ఇప్పుడు ఓటీటీల‌లో బ్రాడ్ కాస్ట్ అవుతోంది. దీనిని కూడా కోర్టు ఆపుతుందా లేదా అన్న‌ది  చెప్ప‌లేం. ఎందుకంటే డిజిట‌ల్ మాధ్య‌మాల‌ను కోర్టులు అడ్డుకోవ‌డం అన్న‌ది ఆశించినంత సులువు కాదు. ఎప్ప‌టి నుంచో వివాదాల‌కు తావిస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో ఇవాళ కూడా మ‌రో వివాదాన్ని తెచ్చింది. గ‌తంలో చెప్పిన విధంగా ఇదంతా మానవ హ‌క్కుల ఉల్లంఘ‌న అని, అనైతిక రీతికి సంకేతం అని చెబుతూ వ‌స్తోంది ప్ర‌జా సంఘాల వాద‌న‌.

బిగ్ బాస్ షో పై ఇప్ప‌టికే సీపీఐ నారాయ‌ణ ఎన్నో సార్లు విమ‌ర్శ‌లు చేశారు. అయినా కూడా అవేవీ వినిపించుకోలేదు షో నిర్వాహ‌కులు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో కోర్టు జోక్యం చేసుకుంది ఓ పిటిష‌నర్ చొర‌వ కార‌ణంగా ! దీంతో ఇప్పుడు ఓటీటీ కేంద్రంగా ప్ర‌సారితం అవుతున్న బిగ్ బాస్ షో నిలుపుదల సాధ్య‌మా కాదా అన్న చ‌ర్చ న‌డుస్తోంది.

బిగ్ బాస్ రియాల్టీ షో పై 2019లో ఓ పిటిష‌న్ దాఖలు అయింది. ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం  పేరిట చెన్న‌య్ కేంద్రంగా ప‌నిచేసే తెలుగు యువ‌శ‌క్తి అధ్య‌క్షులు కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి దీనిని ఏపీ హై కోర్టులో దాఖ‌లు చేశారు. విప‌రీతం అయిన వికృత పోక‌డ‌ల‌ను ప్రోత్స‌హించే ఈ షోను నిలుపుద‌ల చేయాల‌ని, దీనిపై త‌క్ష‌ణం అత్యవ‌స‌రంగా విచార‌ణ చేయాల‌ని శుక్ర‌వారం మ‌రోసారి పిటిష‌నర్ త‌ర‌ఫు న్యాయవాది త‌న త‌ర‌ఫు వాద‌న వినిపిస్తూ కోర్టును కోరారు. దీనిపై న్యాయ స్థానం కూడా సానుకూలంగానే స్పందించి, 2019 లో వేసిన పిటిష‌న్ పై ఇంత‌ర‌కూ మీరు ఏ ఉత్త‌ర్వూ పొంద‌లేదా అని న్యాయ‌స్థానం ప్ర‌శ్నించింది. విచార‌ణ‌ను సోమ‌వారానికి వాయిదా వేసింది.