చైతూ డెబ్యూ సిరీస్..

బాలీవుడ్లో పెద్ద పెద్ద స్టార్లలో చాలామంది డిజిటల్ డెబ్యూ చేసేశారు. అక్కడ వెబ్ సిరీస్‌ల సంస్కృతి కొన్నేళ్ల ముందే మొదలైంది. గత రెండు మూడేళ్లలో అది బాగా ఊపందుకుంది. కానీ సౌత్ ఇండియాలో ఇంకా చిన్న స్థాయిలోనే వెబ్ సిరీస్‌లు తెరకెక్కతున్నాయి. పెద్ద స్టార్లు, ముఖ్యంగా హీరోలు వాటి వైపు ఇంకా పూర్తి స్థాయిలో దృష్టిసారించట్లేదు. టాలీవుడ్ నుంచి ముందుగా అటు వైపు అడుగు పెడుతున్నది అక్కినేని నాగచైతన్యనే.

విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కూడా ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు కానీ.. అంతకంటే ముందు చైతూ సిరీసే ప్రేక్షకులను పలకరించబోతోంది. ‘మనం’, ‘థ్యాంక్ యు’ చిత్రాలు చేసిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అతను కొన్ని నెలల కిందట ‘దూత’ పేరుతో ఓ సిరీస్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సిరీస్ డిజిటల్ డీల్ బయటికి వచ్చింది. స్ట్రీమింగ్ జెయింట్ అమేజాన్ ప్రైమ్‌ ఈ సిరీస్‌ను ప్రసారం చేయబోతోంది. గురువారం ముంబయిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ‘దూత’ తమ ఫ్లాట్ ఫాంలో రిలీజ్ కానున్నట్లు అమేజాన్ ప్రైమ్ వెల్లడించింది.

దీంతో పాటుగా ఆ సంస్థ పలు కొత్త సినిమాలు, సిరీస్‌లను అనౌన్స్ చేసింది. తెలుగు నుంచి క్రేజీ ప్రాజెక్ట్ అంటే ‘దూత’ అనే చెప్పాలి. చైతూ-విక్రమ్ కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉంది. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘మనం’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. దాని తర్వాత ఇద్దరూ ‘థ్యాంక్ యు’ కోసం జట్టు కట్టారు.

ఈ సినిమాను ఇలా పూర్తి చేశారో లేదో అలా ‘దూత’ సిరీస్‌ను మొదలుపెట్టారు. బేసిగ్గా తనకు హార్రర్ జానర్ నచ్చదని, తొలిసారి ఆ జానర్లో నటిస్తున్నానని ఈ సిరీస్ ఆరంభమైన సందర్భంగా చైతూ వెల్లడించాడు. ఇందులో అతను జర్నలిస్టు పాత్ర చేస్తున్నట్లు సమాచారం. మరి హార్రర్ కథలో జర్నలిస్ట్ పాత్ర ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. వేసవిలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.