ఆచార్య‌కు తెలంగాణ ఓకే.. మ‌రి ఏపీ?

స్టార్ హీరోలు న‌టించే పెద్ద సినిమాల‌కు ఒక‌ట్రెండు వారాల పాటు టికెట్ల ధ‌ర‌లు పెంచుకునే, అలాగే రోజూ ఐదో షో వేసుకునే సౌల‌భ్యం క‌ల్పించ‌డం సాధార‌ణం అయిపోయిందీ రోజుల్లో. ముఖ్యంగా తెలంగాణ‌లో ఈ మేర‌కు అనుమ‌తులు తెచ్చుకోవ‌డం పెద్ద క‌ష్టంగా ఏమీ లేదు. రేట్ల పెంపు, అద‌న‌పు షోల‌తో ప్ర‌భుత్వానికి కూడా ప‌న్ను రూపంలో అద‌న‌పు ఆదాయం వ‌స్తుండ‌టంతో ఈజీగానే అనుమ‌తులు ఇచ్చేస్తున్నారు.

ఇది ఒక పాల‌సీ ప్ర‌కారం జ‌రిగిపోతోంది. కాక‌పోతే ఈ రేట్ల పెంపు త‌మ సినిమాల‌కు ఏమాత్రం క‌లిసొస్తుందో చూసుకుని నిర్మాత‌లు అడుగేయాల్సి ఉంటోంది. మెగాస్టార్ చిరంజీవి-రామ్ చ‌ర‌ణ్‌ల క్రేజీ కాంబినేష‌న్లో అగ్ర ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ రూపొందించిన ఆచార్య‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా రేట్ల పెంపు క‌చ్చితంగా ఉంటుద‌నే అంచ‌నా వేశారు. తెలంగాణలో విడుద‌ల‌కు నాలుగు రోజుల ముందే ఈ మేర‌కు అనుమ‌తులు వ‌చ్చేశాయి.

ఆచార్య సినిమాకు మ‌ల్టీప్లెక్సుల్లో టికెట్ ధ‌ర మీద రూ.50, సింగిల్ స్క్రీన్ల‌లో రూ.30 మేర పెంపు అమ‌ల్లోకి రానుంది. అలాగే ఐదో షోకు కూడా అనుమ‌తులు ల‌భించాయి. రేట్ల పెంపు రెండో వీకెండ్ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఐదో షో వారం రోజుల పాటు వేసుకోవ‌డానికి అవ‌కాశ‌మున్న‌ప్ప‌టికీ తొలి వీకెండ్ త‌ర్వాత డిమాండ్ ఉండ‌దు కాబ‌ట్టి తొలి మూడు రోజుల‌కే ఇది పరిమితం కావ‌చ్చు.

రేట్ల పెంపు, ఐదో షో ఓకే అయిపోయాయి కాబ‌ట్టి తెలంగాణ‌లో సోమ‌వారం రాత్రి నుంచే బుకింగ్స్ మొద‌లు కావ‌చ్చు. మ‌రోవైపు ఆంధ్రప్ర‌దేశ్‌లో ఈ ఆఫ‌ర్ ఆచార్య‌కు ఉంటుందో లేదో చెప్ప‌లేం. ఐదో షోకు ఛాన్స్ ఇవ్వొచ్చు కానీ.. చిత్ర బృందంలోని ప్ర‌ధాన వ్య‌క్తుల పారితోష‌కం కాకుండా రూ.100 కోట్ల బ‌డ్జెట్ అవ్వ‌లేదు కాబ‌ట్టి మామూలుగా అయితే రేట్ల పెంపుకు ఛాన్స్ లేన‌ట్లే. కానీ సీఎం జ‌గ‌న్‌తో చిరు, నిర్మాత నిరంజ‌న్ రెడ్డిల సాన్నిహిత్యం దృష్ట్యా ఈ చిత్రానికి ఆఫ‌ర్ ఉండొచ్చ‌నే అనుకుంటున్నారు.