బాహుబలికి ముందు అనుకున్న లైన్

బాహుబలి.. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఇండియన్ సినిమాను బాహుబలికి ముందు, తర్వాత అని విభజించి చూడాల్సిన స్థాయిలో ఆ చిత్రం ప్రభావం చూపించింది అనడంలో సందేహం లేదు. ఏ ముహూర్తాన రాజమౌళి ఈ సినిమా గురించి ఆలోచన చేశాడో కానీ.. ఆ చిత్రం రేపిన సంచలనం అలాంటిలాంటిది కాదు. మరి ఈ కథకు రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కలిసి ఎలా శ్రీకారం చుట్టారు. ఈ కథ ఎలా పుట్టింది.. దీన్ని ఎలా విస్తరించారు అన్నది ఆసక్తికరం.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ ‘బాహుబలి’ కథ ఎలా పురుడు పోసుకుందో వివరించారు. సినిమాలో చూసిందానికి కొంచెం భిన్నంగా ఒక లైన్ తాను ముందుగా రాజమౌళికి చెబితే.. అక్కడి నుంచి కథా విస్తరణ జరిగినట్లు ఆయన వివరించారు. ఈ కథకు మూలం కట్టప్ప పాత్ర అని కూడా ఆయన వెల్లడించారు.

‘బాహుబలి: ది బిగినింగ్’లో సుదీప్-సత్యరాజ్ మధ్య వచ్చే సన్నివేశం గుర్తుంది కదా. ‘బాహుబలి’ కథ ఆ సన్నివేశంతోనే మొదలు పెట్టామని.. కానీ అప్పుడు అనుకున్న సన్నివేశం వేరని ఆయన వివరించారు. తాను ఒక భారీ చిత్రం చేయాలనుకుంటున్నానని.. అందుకు బాగా యాక్షన్ నిండిన కథ కావాలని, భారీతనం ఉండాలని, బలమైన క్యారెక్టర్లు ఉండాలని ముందుగా తనకు రాజమౌళి చెప్పినట్లు విజయేంద్ర వెల్లడించారు.

ఇక తాను రాజమౌళికి చెప్పిన తొలి సన్నివేశం గురించి వివరిస్తూ.. ‘‘విదేశాల నుంచి ఒక వర్తకుడు వచ్చాడు ఆయుధాలు అమ్ముకోవడానికి. చూస్తే 80 సంవత్సరాల వయసున్న పెద్దాయన పిల్లలకు కత్తి యుద్ధం నేర్పిస్తున్నాడు. అది చూసి మీరు గొప్ప వీరుడిలా ఉన్నాడే అని మాట కలిపితే.. మీకు బాహుబలి గురించి తెలియదా? అని అడుగుతాడు. ఎవరాయన అని ప్రశ్నిస్తే.. తామిద్దరం కలిసి చాలా ఏళ్లు సాధనం చేశాం.. యుద్ధాలు చేశాం అని వివరిస్తాడు. ఒకసారి అడవిలో వెళ్తుండగా 200 మంది ఒకేసారి వచ్చి దాడి చేశారు. వాళ్లతో అతను యుద్ధం చేస్తుంటే మహాభారతంలో అర్జునుడు ఇలాగే ఫైట్ చేసేవాడేమో అనిపించింది. సాయంత్రం అయ్యేసరికి రక్తంలో తడిసి ముద్దయ్యాడు. కానీ అతడి ఒంటి మీద ఉన్న ఒక్క రక్తపు చుక్క కూడా అతడిది కాదు. ఎందుకంటే ఒంటి మీద గాటు పెట్టగల వీరుడు పుట్టలేదు అని ఆ ముసలాయన వివరిస్తాడు. అంతటి వీరుడిని ఒకసారి చూడాలి అని ఆ వర్తకుడు అడిగితే.. బాధగా ముఖం పెట్టి చనిపోయాడు అంటాడు. మరి ఎవ్వరూ అతణ్ని తాకలేరు అన్నారు ఎలా చనిపోయాడు అంటే.. కత్తి పోటు కన్నా వెన్నుపోటు బలమైంది. ఆయన్ని నేనే చంపేశా అంటాడు’’ అని చెప్పారు విజయేంద్ర. ఆ తర్వాతి రోజు శివగామి బాహుబలిని నీళ్లలో ఒంటి చేత్తో పైకెత్తుకుని అతడి ప్రాణాలు కాపాడే సన్నివేశం చెప్పానని.. ఇక్కడి నుంచి పాత్రలు, కథ విస్తరణ జరిగిందని విజయేంద్ర చెప్పారు.