వీర‌మ‌ల్లుకు స‌న్న‌ద్ధం.. ప‌వ‌న్ పిక్ వైర‌ల్

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఉన్న‌ స్టామినాకు బాహుబలి తరహా చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా చేస్తే దాని రేంజే వేరుగా ఉంటుందని ఎప్పట్నుంచో అనుకుంటున్నారు ఫ్యాన్స్. వారి కోరికను క్రిష్ తీర్చేయబోతున్నాడు. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు నుంచి ఇప్ప‌టిదాకా రిలీజైన ప్రోమోలు చూస్తే ఇది బాహుబలి లైన్లోనే తెర‌కెక్కుతున్న భారీ చిత్రంలా క‌నిపిస్తోంది. ఐతే ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. క‌రోనా, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చింది.

స‌గం చిత్రీక‌ర‌ణ జ‌రిపాక ఈ సినిమాకు బ్రేక్ ప‌డింది. ప‌వ‌న్ భీమ్లా నాయ‌క్‌లో బిజీ అయిపోయాడు. క్రిష్ ఏమో కొండ‌పొలం ప‌నిలో ప‌డ్డాడు. వీళ్లిద్ద‌రూ ఆ చిత్రాల‌ను పూర్తి చేశాక కూడా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు పునఃప్రారంభం కావ‌డంలో ఆల‌స్యం జ‌రుగుతోంది. ఐతే త‌ర్వాతి షెడ్యూల్లో చిత్రీక‌రించాల్సిన‌వి భారీ యుద్ధ స‌న్నివేశాలు కావ‌డంతో దీనికోసం ప్రిప‌రేష‌న్ అవ‌స‌ర‌మైంది.

మామూలుగా ఇలా వ‌చ్చి అలా షూటింగ్ చేసి వెళ్లిపోయే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా స‌న్న‌ద్ధం కావాల్సి వ‌చ్చింది. మ‌రి కొన్ని రోజుల్లో కొత్త షెడ్యూల్ ఆరంభం కానుండ‌గా ప‌వ‌న్ ఇందుకోసం ప్రిప‌రేష‌న్లో ఉన్న ఫొటో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలోకి వ‌చ్చింది. టీష‌ర్ట్, షార్ట్స్ వేసుకుని.. మోకాళ్ల‌కు దెబ్బ‌లు త‌గల‌కుండా తొడుగులు వేసుకుని ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తాతో క‌లిసి ఈ ఫొటోకు పోజు ఇచ్చాడు ప‌వ‌న్.

ప‌వ‌ర్ స్టార్‌ను స‌రికొత్త లుక్‌లో చూసి ఆశ్చ‌ర్య‌పోతున్న ఫ్యాన్స్ ఈ ఫొటోను వైర‌ల్ చేస్తున్నారు. ప‌వ‌న్ కూడా సినిమా కోసం ఇలా ప్రిపేర‌వుతాడా అని కామెంట్లు చేస్తున్నారు నెటిజ‌న్లు. ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ ఓ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సీనియ‌ర్ నిర్మాత ఎ.ఎం.ర‌త్నం ఈ చిత్రాన్ని బ‌హు భాష‌ల్లో నిర్మిస్తున్నాడు.