మహేష్‌! అడివిలోనా? జేమ్స్ బాండా??

ఒక ప్రక్కన స్వయంగా ఆ సినిమా తీసేవాళ్ళే మేము పలానా టైపు కథ చేస్తున్నాం అని చెబుతుంటారు. ఇంకో ప్రక్కన మాత్రం వాళ్లు తీసేది అది కాదు ఇది అంటూ చాలా రూమర్లు వస్తుంటాయ్. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్‌ దిగ్గజదర్శకుడు రాజమౌళి డైరక్షన్లో చేయబోయే  తదుపరి సినిమా పరిస్థితి అలానే ఉంది. ఈ రూమర్లన్నీ విన్నాక ఇంతకీ ఈ సినిమా కథేంటో రాజమౌళికైనా తెలుసా అనే సందేహం రాకుండా ఉండదు. పదండి ఆ కథా కమామిషు ఏంటో చూద్దాం.

మొన్నామధ్యన ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్లలో భాగంగా.. మహేష్‌ సినిమా మల్టీ స్టారర్ కాదంటూ రాజమౌళి.. అలాగే ఈ సినిమాను ఆఫ్రికన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నాం అంటూ ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ కన్ఫామ్ చేశారు. వీళ్లు ఆ క్లారిటీ ఇచ్చి ఓ వారం అయ్యిందో లేదో.. అదిగో రాజమౌళి మహేష్‌ బాబుతో చేసేది జేమ్స్ బాండ్ సినిమా అని, ఈ సినిమా బడ్జెట్ 800 కోట్లు అంటూ రూమర్లు చెక్కర్లు కొట్టిస్తున్నారు. నిజానికి 800 కోట్లు బడ్జెట్ అనేది కేవలం ఫ్యాన్స్ కోసం చెబుతున్న పులిహోర అని అందరికీ అర్దమవుతోంది.

టాలీవుడ్ బయట ఇప్పటివరకు మహేష్‌ కు మార్కెట్ లేదు. ఇక ఆర్.ఆర్.ఆర్.లో ఇద్దరు హీరోలను పెట్టినాకాని ఒక వెయ్యి కోట్లు వస్తుందో రాదో అనే డౌట్ ఇంకా ఉంది. కనీసం ఆర్.ఆర్.ఆర్. ఫైనల్ బాక్సాఫీస్ కలక్షన్లు కూడా రాకముందే ఇలా మహేష్‌ సినిమా బడ్జెట్ గురించి మాట్లాడటం కాస్త అతే అనిపిస్తుంది.

ఇకపోతే జేమ్స్ బాండ్ సినిమా కథల్లో హుమన్ ఎమోషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మరి రిలేషన్స్ అండ్ ఎమోషన్స్ అనేవి లేకుండా అస్సలు సినిమాయే టచ్ చెయ్యని రాజమౌళి.. మహేష్‌ తో ఒక స్పై థ్రిల్లర్ చేస్తాడా అనేది ఇక్కడ ఆలోంచించాల్సిన విషయం. ఆఫ్రికన్ అడవుల్లో కథంటే.. ఖచ్చితంగా స్పై థ్రిల్లర్ అయ్యుండదు. ఏదన్నా కౌబాయ్ తరహా సినిమానో లేదంటే ఇండియా నుండి అక్కడికెళ్ళి అక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తరహా కథాంశమో కూడా అయ్యే ఛాన్సుంది. అయినా సినిమా ప్రకటించే ముందు తను తియ్యబోయే కతేంటో రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టేసి మరీ చెబుతాడు. కాబట్టి ఇలా కథ గురించి బడ్జెట్ గురించి ఇప్పుడు అనవసరమైన రూమర్లు పుట్టించాల్సిన అవసరం లేదేమో!!