హీరో హీరోయిన్ల పెళ్లికి రంగం సిద్ధం?

తెలుగులో ఒకప్పుడు టాప్ డైరెక్టర్లలో ఒకడు రవిరాజా పినిశెట్టి. 80, 90 దశకాల్లో ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు ఇచ్చిన ఘనత ఆయన సొంతం. ఆయన కొడుకులు ఇద్దరూ సినీ రంగంలోకే వచ్చారు. పెద్ద కొడుకు సత్యప్రభాస్ పినిశెట్టి తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ దర్శకుడిగా మారితే.. చిన్న కొడుకు ఆది పినిశెట్టి హీరో అయ్యాడు. తెలుగులో ‘ఒక విచిత్రం’ అనే ఫ్లాప్ మూవీతో అరంగేట్రంలో చేదు అనుభవం ఎదుర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత తమిళంలోకి వెళ్లి మృగం, ఈరం (వైశాలి) లాంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుని హీరోగా స్థిరపడ్డాడు.

‘సరైనోడు’, ‘రంగస్థలం’ సహా కొన్ని చిత్రాలతో తిరిగి తెలుగు ప్రేక్షకులనూ మెప్పించాడు. త్వరలోనే 40వ పడిలోకి అడుగు పెడుతున్న ఆది.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయినట్లు సమాచారం. తనతో రెండు సినిమాల్లో కథానాయికగా నటించిన కన్నడ అమ్మాయి నిక్కీ గల్రానిని అతను పెళ్లాడబోతున్నట్లు సమాచారం.

తెలుగులో ‘మలుపు’ పేరుతో విడుదలైన తమిళ చిత్రంలో ఆది, నిక్కి కలిసి నటించారు. ఆ తర్వాత ‘మరకతమణి’ అనే మరో చిత్రంలోనూ జోడీ కట్టారు. ఆ టైంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో ఆది కుటుంబ వేడుకల్లో నిక్కి కనిపించడంతో వీళ్ల మధ్య ప్రేమాయణం నడుస్తున్న విషయం ప్రపంచానికి తెలిసిందే. కానీ ఇద్దరూ పెళ్లి సంగతి మాత్రం ఎత్తలేదు. ఆరేడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఇరువురి కుటుంబాల నుంచి ముందే అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. పెళ్లి ఎప్పుడు చేసుకోవాలన్నది వీరి నిర్ణయానికే వదిలేశారు. ఎట్టకేలకు ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వడానికి సిద్ధమైందని.. త్వరలోనే పెళ్లి జరగబోతోందని.. దీని గురించి అధికారిక ప్రకటన కూడా ఇవ్వబోతున్నారని తమిళ మీడియా రిపోర్ట్ చేస్తోంది. నిక్కి సోదరి అయిన మరో హీరోయిన్ సంజనా గల్రాని ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డ సంగతి తెలిసిందే.