నితిన్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ

బాలీవుడ్ బ్యూటీస్ కోసం టాలీవుడ్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అందుకే మిగతా భాషల కంటే మన దగ్గరే నార్త్ హీరోయిన్స్ ఎక్కువ వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు మరొక బాలీవుడ్‌ బ్యూటీ కూడా తెలుగునాట జెండా పాతడానికి ట్రై చేస్తోంది. ఆమె మరెవరో కాదు.. ఊర్వశీ రౌతేలా.     

ఆల్రెడీ ఊర్వశి ఓ తెలుగు సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. అదే ‘బ్లాక్‌ రోజ్‌’. సంపత్ నంది అందించిన కథతో మోహన్ భరద్వాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. ఇప్పుడు నితిన్ నటిస్తన్న ‘మాచర్ల నియోజకవర్గం’ లోనూ ఊర్వశి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెస్ రాజశేఖర్‌‌రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ పొలిటికల్ డ్రామాలో ఆల్రెడీ కీర్తి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఒక కీలక పాత్ర కోసం ఊర్వశిని తీసుకున్నారని సమాచారం.       

నిజానికి పుష్ప సినిమా విషయంలోనూ ఊర్వశి పేరు వినిపించింది. ఊ అంటావా ఊఊ అంటావా పాటకి మొదట ఆమెనే అడిగారట. రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడంతో వద్దనుకున్నారని వార్తలు వచ్చాయి. స్టార్ హీరోయిన్ చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందని తర్వాత సమంతను తీసుకున్నాడు సుకుమార్. ఇప్పుడు నితిన్ సినిమాలో ఊర్వశి నటించడం నిజమా కాదా అనేది కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే కానీ చెప్పలేం.        

ప్రస్తుతానికైతే ఆమె ఓ తమిళ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. మొన్నటి వరకు ఉక్రెయిన్‌లో షూటింగ్ జరిగింది. ఆ దేశంపై రష్యా దాడి చేయడానికి సరిగ్గా రెండు రోజుల ముందే ఇండియాకి తిరిగొచ్చింది ఊర్వశి. ఆ దేశానికి చెందిన మ్యుజీషియన్‌ మొనాటిక్‌తో కలిసి ఓ మ్యూజిక్ వీడియో కూడా చేయబోతోంది. మరి తెలుగు సినిమా సంగతి త్వరలోనే రివీల్ చేస్తుందేమో చూడాలి.