నిశ్శబ్ధం మళ్ళీ శబ్ధం చేస్తోంది!

ఓటిటీ రిలీజ్ చేయడం ఏదో చాలా చిన్నతనం అన్నట్టు థియేటర్లు లేని ఈ సమయంలో ఓటిటీ వేదిక వాడుకుంటున్నారంటే చాలా మంది అఫెండ్ అవుతున్నారు. అనుష్క నటించిన నిశ్శబ్ధం చిత్రానికి సంబంధించి ఈ వార్తలు వస్తే ఆ టీం చాలా హర్ట్ అయింది. తమ సినిమా థియేటర్లలో మాత్రమే అంటూ నొక్కి వక్కాణించింది.

కొద్ది రోజుల క్రితం జోరు చూస్తే లాక్ డౌన్ మొత్తం ఎత్తేసి సినిమా థియేటర్లు కూడా ఓపెన్ చేసేస్తారని భావించారు. దాంతో మరి కొద్ది రోజులు ఓపిక పడితే చాలని అనుకున్నారు. కానీ ఇప్పటి సీన్ చూస్తే ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ కాకపోవచ్చు. షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసినా కానీ జనాలు లేక వెలవెలబోతున్నాయి. సినిమా థియేటర్లు ఓపెన్ చేసినా కానీ పరిస్థితి అదే అవుతుంది. అందుకే మరోసారి నిశ్శబ్దం ఓటిటీ కథ తెరమీదకు వచ్చింది.

ఓటిటీ ద్వారా విడుదలైన పర భాషా చిత్రాలకు స్పందన అంతగా లేకపోవడంతో అమెజాన్, నెట్ ఫ్లిక్స్ కాస్త దూకుడు తగ్గించాయి. ఇక్కడ డిమాండ్ తగ్గిపోయేలోగా ఈ దారిలో అయినా త్వరగా బయటపడాలని ఇప్పుడు తెలుగు నిర్మాతలు పలువురు తొందర పడుతున్నారు. అన్నీ కుదిరితే బహుశా త్వరలోనే నిశ్శబ్ధం వీడి శబ్దం మొదలవుతుంది.