అజిత్ రాలేదు.. రాడు

తమిళంలో ప్రస్తుతం బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు. అతడి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డుల మోత మోగిపోతుంది. డివైడ్ టాక్ వచ్చినా సరే.. ఓపెనింగ్స్‌కు ఢోకా ఉండదు. రిలీజ్ ముంగిట అజిత్ సినిమాలకు హైప్ అలా ఉంటుంది మరి. అలాగని అతనేమీ తన సినిమాలను తెగ ప్రమోట్ చేసేస్తాడా అంటే అలాంటిదేమీ ఉండదు. ఇప్పటిదాకా తన సినిమాలకు సంబంధించి ఆడియో వేడుకలు, ప్రి రిలీజ్ ఈవెంట్లు, ప్రెస్ మీట్లలో ఎన్నడూ పాల్గొన్నదే లేదు. చిత్ర బృందంలోని మిగతా వాళ్లు ఏవో ఈవెంట్లు చేసుకుంటారు.

వాటి కోసం కనీసం అజిత్ చినన వీడియో బైట్ కూడా ఇవ్వడు. సినిమాల రిలీజ్ టైంలో కానీ, వేరే సమయాల్లో కానీ అజిత్ మీడియాలో అస్సలు కనిపించడు. ఇంటర్వ్యూలు ఇవ్వడు. సినిమా చేశామా.. దాన్ని చిత్ర బృందం  చేతుల్లో పెట్టేసి వేరే సినిమా పనిలో పడిపోయామా అన్నట్లుంటుంది అతడి తీరు. తన కొత్త సినిమా ‘వలిమై’కి కూడా అజిత్ ప్రమోషన్లు ఏమీ చేయలేదు. కానీ ఈ సినిమా క్రేజ్ మామూలుగా లేదు.

తమిళ హీరోల చిత్రాలు తెలుగులో విడుదలవుతుంటే.. ఇక్కడొచ్చి ప్రమోషన్లు చేయడం మామూలే. కానీ అజిత్ మాత్రం ఇందుకు మినహాయింపు. రజినీకాంత్, విజయ్, సూర్య సహా తమిళ బిగ్ స్టార్లందరూ తమ చిత్రాలను తెలుగులో ప్రమోట్ చేసిన వారే. కానీ అజిత్ మాత్రం ప్రమోషన్లు అక్కడా చేయడు. ఇక్కడా చేయడు. ‘వలిమై2 తెలుగులోనూ పెద్ద స్థాయిలోనే రిలీజవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కార్తికేయ, హ్యూమా ఖురేషి ఇక్కడి మీడియాను కలిశారు. తాజాగా ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా చేశారు. అందులో వీళ్లిద్దరితో పాటు నిర్మాత బోనీ కపూర్, దర్శకుడు వినోద్ పాల్గొన్నారు.

ఈ వేడుకలో అజిత్ లేడేంటని మన వాళ్లు కొంత ఆశ్చర్యపోయి ఉండొచ్చు కానీ.. అజిత్ గురించి తెలిసిన వాళ్లెవరికీ ఇది ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. విశేషం ఏంటంటే అజిత్ తన కెరీర్ ఆరంభంలో ‘ప్రేమ పుస్తకం’ అనే డైరెక్ట్ తెలుగు మూవీ చేశాడు. గొల్లపూడి మారుతి రావు తనయుడు గొల్లపూడి శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా షూటింగ్ మధ్యలో అతను ప్రమాదవశాత్తూ మరణించాడు. మిగతా భాగాన్ని మారుతీరావు పూర్తి చేశారు. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ కాలేదు కానీ.. మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. మూడు నంది అవార్డులు కూడా గెలిచింది. ఆ తర్వాత ‘ప్రేమలేఖ’ సహా కొన్ని అనువాద చిత్రాలతో అజిత్ మన ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.