కొత్త నిర్మాత.. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి

కేదార్ సెలగంశెట్టి.. ఏడాది కిందట ఈ పేరు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడైన సుకుమార్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా ఈ కొత్త నిర్మాత ఒక సెన్సేషనల్ మూవీని అనౌన్స్ చేయడం గుర్తుండే ఉంటుంది. ఇతను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు అత్యంత సన్నిహితుడని.. బన్నీకి ఫాల్కన్ పేరుతో లగ్జరీ కారవాన్ బహుమతిగా ఇచ్చింది అతనే అని.. అందుకు బదులుగానే తనకు సన్నిహితుడైన సుకుమార్‌తో సినిమా సెట్ చేశాడని అప్పట్లో టాలీవుడ్లో చర్చ నడిచింది. 

ఈ నిర్మాత బేనర్ పేరు కూడా ‘ఫాల్కన్ క్రియేషన్స్’ అని పెట్టడంతో ఈ ప్రచారం నిజమే అనిపించింది. ఐతే ఘనంగా ఈ ప్రాజెక్టును ప్రకటించడం అయితే జరిగింది కానీ.. ఎంతకీ ఇది పట్టాలెక్కలేదు. ఈ సినిమా అనౌన్స్ చేసే సమయానికి ‘పుష్ప’ ఒక పార్ట్‌గానే రిలీజ్ కావాల్సింది. తర్వాతేమో అది రెండు భాగాలైంది. ఇప్పుడు సుక్కు రెండో పార్ట్ మీద దృష్టిపెట్టాడు.

దీని తర్వాతేమో రామ్ చరణ్‌తో సినిమా అంటున్నారు. విజయ్-సుక్కు కాంబినేషన్లో కేదార్ తీయాల్సిన సినిమా గురించి ఏ చర్చా లేదు. దాని గురించి అంతా మరిచిపోయారు.కట్ చేస్తే ఇప్పుడు కేదార్ సెలగంశెట్టి మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. అతను నిర్మాతగా కొత్త సినిమా అనౌన్స్ అయింది. అదే.. గంగం గణేశా. ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కావడం విశేషం.

వంశీ కారుమంచి అనే మరో నిర్మాతతో కలిసి చిన్న బడ్జెట్లో ఈ సినిమా చేస్తున్నాడు కేదార్. దీని కోసం వేరుగా ‘హైలైఫ్’ అనే కొత్త బేనర్ పెట్టారు. ఐతే విజయ్-సుక్కుల క్రేజీ కాంబినేషన్లో భారీ చిత్రం ప్లాన్ చేసుకుంటే.. అది కాస్తా పక్కకు వెళ్లిపోయి ఆనంద్ తమ్ముడు, ఉదయ్ శెట్టి అనే కొత్త దర్శకుడితో చిన్న సినిమా చేసుకోవాల్సి వచ్చిందేంటి అని ఇండస్ట్రీ జనాలు ఆశ్చర్యపోతున్నారు. బహుశా తనతో సినిమా కార్యరూపం దాల్చనందుకు పరిహారంగా విజయే ఈ ప్రాజెక్టు సెట్ చేసి ఉండొచ్చు.