కోలీవుడ్ స్టార్‌‌ క్రేజీ లైనప్

రెండేళ్ల క్రితం వరకు సూర్య సినిమా వస్తోందంటేనే అందరూ అనుమానంగా చూసేవారు. ఈసారైనా హిట్టు కొడతాడా లేదా అని సందేహపడేవారు. ఆ రేంజ్‌లో ఫెయిల్యూర్స్ వచ్చాయి మరి. అయితే ఆకాశమే నీ హద్దురా మూవీ చేసిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. రీసెంట్‌గా ‘జైభీమ్‌’ కూడా విజయ ఢంకా మోగించడంతో పాటు ఆస్కార్‌‌ బరిలో నిలవడంతో అతడి డిమాండ్ మరింత పెరిగిపోయింది.

దాంతో సినిమాల లైనప్ కూడా పెరిగిపోతోంది. ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో ఎదర్కుమ్ తుణీందవన్ అనే మూవీలో నటిస్తున్నాడు సూర్య. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. సన్‌ పిక్చర్స్ సంస్థ ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తోంది. గ్యాంగ్ లీడర్, శ్రీకారం చిత్రాల ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అది కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో.  దీని తర్వాత వెట్రిమారన్ డైరెక్షన్‌లో ‘వాడి వాసల్‌’ చిత్రంలోనూ యాక్ట్ చేయనున్నాడు సూర్య.

ఈ మూవీని ఆల్రెడీ పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. షూటింగ్‌ మాత్రం ఇంకా మొదలు కాలేదు. పాండిరాజ్ మూవీ రిలీజయ్యాక ఈ మూవీ సెట్స్‌కి వెళ్లనుంది. ఇంతలోనే మరో ఇద్దరు దర్శకుల్ని కూడా లైన్‌లో పెట్టేశాడు సూర్య. వాళ్లెవరో కాదు.. సుధ కొంగర, శివ. వరుస పరాజయాలతో సతమతమవుతున్న సూర్యకి ఆకాశమే నీ హద్దురా చిత్రంతో చాలా మంచి హిట్ ఇచ్చింది సుధ.

అందుకే ఆమెతో మరో మూవీకి కమిటయ్యాడు సూర్య. ఇక కమర్షియల్ సినిమాలు తీయడంలో శివ సిద్ధహస్తుడు. వీరమ్, వేదాళం, వివేగం, విశ్వాసం అంటూ అజిత్‌కి చాలా పెద్ద హిట్లు ఇచ్చాడు. అందుకే తనతో ఓ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇవి కాక నిర్మాతగానూ నాలుగైదు సినిమాలు పట్టాలెక్కించబోతున్నాడు. క్రేజీ లైనప్‌తో తన ఫ్యాన్స్‌లో జోష్‌ పెంచుతున్నాడు.