షోరూమ్‌లో `చిరంజీవి సినిమా సీన్`

కారు షోరూంలోకి ఒక రైతు వెళ్లాడు. కారు ధ‌ర అడిగాడు. దీంతో సిబ్బంది ఆయ‌న‌ను ఇన్స‌ల్ట్ చేశారు. “కారు ధ‌ర చెప్పాలా? ఇది పావ‌లా అర్ధ రూపాయి కాదు!“ అంటూ  అవ‌హేళ‌న‌గా మాట్టాడారు. ఆ త‌ర్వాత‌.. ఇక్క‌డ చిరంజీవి న‌టించిన సినిమాలోని ఒక సీన్ క‌నిపించింది. దీంతో సిబ్బంది అవాక్క‌య్యారు.. స్నేహం కోసం సినిమాలో పంచకట్టులో.. చిరంజీవి, విజయ్ కుమార్ కలిసి ఓ కార్ల షోరూమ్కు వెళ్తారు.

వారిని చూసి అక్కడి మేనేజర్ అవమానిస్తాడు. కారు కొనే ముఖాలేనా? అని ప్ర‌శ్నిస్తాడు. ఆ తర్వాత.. గోనె సంచిలో నుంచి డబ్బుల కట్టలు తీయగా ఆశ్చర్యానికి గురై తన తప్పును తెలుసుకుని కారును విక్రయిస్తాడు. ఇలాంటి సీనే కర్ణాటకలోని ఓ మహీంద్రా షోరూమ్లో జరిగింది. మహీంద్రా బొలెరో కొనేందుకు ఓ రైతు షోరూమ్కు వెళ్లగా.. అక్కడి సేల్స్మ్యాన్ అవమానించాడు.

కర్ణాటక, తుముకూర్లోని ఓ మహీంద్రా కార్ల షోరూమ్కు కెంపెగౌడ అనే రైతు తన స్నేహితులతో కలిసి బొలెరో పికప్ ట్రక్కు కొనేందుకు వెళ్లారు. లోపలకు వెళ్లిన క్రమంలో వారి వస్త్రాలంకరణను హేళన చేస్తూ అక్కడి సేల్స్మ్యాన్ అవమానించాడు. కారు ధర మీరనుకున్నట్లు 10 రూపాయ‌లు కాదంటూ వారిని తక్కువ చేసి మాట్లాడాడు. ఈ సంఘటన మొత్తం అక్కడే ఉన్న ఒకరు రికార్డు చేశారు. రైతును ఉద్దేశిస్తూ సేల్స్మ్యాన్ అసభ్యకరంగా మాట్లాడాడు.

తమ వస్త్రధారణ చూసి అవమానించిన సేల్స్మ్యాన్కు రైతు.. ధీటైన సమాధానమిచ్చారు. గంటలో రూ.10 లక్షలు తీసుకొచ్చి వెంటనే కారు డెలివరీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు చేసిన ప్రతీకార చర్యతో షాక్కు గురైన షోరూమ్ సిబ్బంది.. మూడు రోజుల్లో కారు డెలివరీ చేస్తామని రైతుకు, ఆయన స్నేహితులకు తెలిపారు. అక్కడి నుంచి వెళ్లిన రైతు.. తుముకూర్లోని తిలక్నగర్ పోలీస్ స్టేషన్లో షోరూమ్ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. చివరకు షోరూమ్ సేల్స్మ్యాన్, ఇతర ఉద్యోగులు కెంపెగౌడకు క్షమాపణలు చెప్పారు. రాతపూర్వక క్షమాపణ పత్రాన్ని అందించారు. అనంతరం ఇరువర్గాలతో మాట్లాడిన పోలీసులు.. వివాదానికి ముగింపు పలికారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో సోష‌ల్‌మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తోంది.