బెల్లంకొండ డ్రాప్?


సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రాన్ని నిజానికి ఎన్టీఆర్ చేయాలనుకున్నారు. కానీ ఈలోపే కృష్ణ ఆ కథతో సినిమా చేశాడు. సూపర్ హిట్ కొట్టాడు. ఈ విషయంలో అప్పట్లో ఎన్టీఆర్, కృష్ణలకు విభేదాలు కూడా వచ్చినట్లు చెబుతారు. ఆ తర్వాత కూడా ఇలా ఒకే కథతో రెండు సినిమాల వివాదాలు లేకపోలేదు. ఈ మధ్య అలాంటి వివాదమే ఒకటి టాలీవుడ్లో తలెత్తింది.

ఒకప్పుడు ఆంధ్రా ప్రాంతంలో దోపిడీలతో హడలెత్తించిన గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఇంతకుముందే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘స్టువర్టుపురం దొంగ’ పేరుతో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కేఎస్ అనే దర్శకుడితో శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఈ సినిమాను ప్రకటించారు. ఐతే ఈ అనౌన్స్‌మెంట్ వచ్చిన కొన్ని రోజులకు ఇదే కథతో ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే టైటిలే పెట్టి రవితేజ ప్రధాన పాత్రలో సినిమాను ప్రకటించారు. దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రాల దర్శకుడు వంశీ ఆకెళ్ల దీనికి డైరెక్టర్. అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించనున్నట్లు ప్రకటించడం తెలిసిందే. దీంతో ఒకే కథతో ఒకే సమయంలో రెండు సినిమాలేంటి అన్న ప్రశ్న తలెత్తింది. వీటిలో ఏదో ఒకటి డ్రాప్ కాక తప్పదేమో అన్న సందేహాలు కలిగాయి.

ఇప్పుడు ఆ సందేహాలే నిజమైనట్లు వార్తలొస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ప్రకటించిన ‘స్టువర్టుపురం దొంగ’ చిత్రాన్ని ఆపేస్తున్నారట. రవితేజతో ప్రకటించిన సినిమా స్కేల్ పెద్దది కావడం.. దానికి స్క్రిప్టు కూడా బాగా వచ్చిందన్న సమాచారం ఉండటం.. పైగా శ్రీనివాస్ హిందీ ‘ఛత్రపతి’తో బిజీగా ఉండటంతో రవితేజే ముందు తన సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తుండటం.. ‘స్టువర్టుపురం దొంగ’ చిత్రాన్ని ఆపేయడమే మంచిదన్న నిర్ణయానికి ఆ చిత్ర బృందం వచ్చినట్లు సమాచారం. మరోవైపు రవితేజ ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాల్లో ఏదో ఒకటి హోల్డ్ చేసి అయినా.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు తెలిసింది.