నాన్న మాటే చైతూ మాట

ప్రస్తుతం మీడియాను కలిసిన ప్రతి ఫిలిం సెలబ్రెటీకి కామన్‌గా ఎదురవుతున్న ప్రశ్నలు.. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల ధరల తగ్గింపుపై మీ స్పందనేంటి? ఆ రేట్లతో మీ సినిమాకు సమస్య లేదా? మొన్న ‘బంగార్రాజు’ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో అక్కినేని నాగార్జునకు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నలకు ఆయనిచ్చిన సమాధానాలు అందరికీ షాకిచ్చాయి. అక్కడున్న ధరలతో తన సినిమాకైతే ఏ ఇబ్బందీ లేదనేశారాయన.

ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ నొక్కి వక్కాణించారు కూడా. అంతే కాక సినిమా వేడుకల్లో రాజకీయ అంశాలు మాట్లాడనంటూ  ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చర్చనీయాంశమైంది. తాజాగా నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ థ్యాంక్ యు మీట్లో ఇదే విషయమై ప్రశ్నలు ఎదురైతే తన స్పందన తెలియజేశారు. సినిమా పరిశ్రమ తరఫున తమ సమస్య చెప్పుకుందామనుకున్నా వినే నాథుడెవరున్నారు అంటూ తన అసహనం ప్రకటించారు.

ఇప్పుడిక నాగచైతన్య వంతు వచ్చింది. ‘బంగార్రాజు’ ప్రమోషన్లో భాగంగా ఈ రోజు చైతూ మీడియాను కలిశాడు. ఈ సందర్భంగా టికెట్ల రేట్ల అంశాన్ని ప్రస్తావిస్తే.. తన తండ్రి మాటే తన మాట అన్నట్లుగా మాట్లాడాడు చైతూ. ‘‘నేను నటుణ్ని మాత్రమే. ఈ ఇష్యూస్ అన్నిటి గురించి నాకు అంతగా తెలియదు. నాన్న గారు ఆల్రెడీ సినిమా బడ్జెట్ పరంగా క్లియర్ గా ఒక మాట చెప్పేశారు.

ఈ సినిమా బడ్జెట్‌కి ఈ ధరలు ఓకే అన్నారు. ఒకవేళ రేట్లు పెరిగితే బోనస్ అన్నారు’’ అని చైతూ అన్నాడు. తన తండ్రి మాటలు వివాదాస్పదం అయి.. ఇండస్ట్రీ వైపు నుంచే చాలా విమర్శలు వచ్చిన నేపథ్యంలో మళ్లీ తాను ఒక కామెంట్ చేసి ఇంకో వివాదం రాజేయడం ఎందుకు అనుకున్నట్లున్నాడు చైతూ. మామూలుగానే అతను వివాదాలకు దూరం. ఈ అంశంలో మరింత జాగ్రత్తగా మాట్లాడినట్లున్నాడు చైతూ. ‘బంగార్రాజు’ సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.