సమంత కళ్లల్లో నీళ్లు

నాగచైతన్య నుంచి విడాకులు పొందినప్పటి నుంచి సమంతను గమనిస్తుంటే.. ఆమె ఫేజ్ దాటడానికి ఇబ్బంది పడుతున్న సంగతి స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది. తన సోషల్ మీడియాలో ఇన్ డైరెక్ట్ పోస్టుల ద్వారా తన స్థితిని ఆమె తెలియజేస్తూనే ఉంది. విడాకులు ఆమె జీవితాన్ని ఒక రకంగా కుదిపేసినట్లే కనిపించింది ఆ పోస్టులు, వివిధ సందర్భాల్లో సమంత స్పందించిన తీరు చూస్తే. తాజాగా మరోసారి సమంత తన బాధను పరోక్షంగా బయటపెట్టింది.

హైదరాబాద్ సిటీలో కొత్తగా మొదలైన ఒక కౌన్సెలింగ్ సెంటర్ ప్రారంభోత్సవానికి సమంత ముఖ్య అతిథిగా హాజరైంది. ఆ సందర్భంగా సమంత.. డిప్రెషన్ వల్ల తలెత్తే దుష్పరిణామాల గురించి, ఆ సమయంలో సన్నిహితుల సహకారం ఎంత అవసరం, అలాగే మానసిక వైద్యుల నుంచి కౌన్సెలింగ్ తీసుకోవడం ఎంత ముఖ్యం అనే విషయాలపై సమంత మాట్లాడింది.వ్యక్తిగత జీవితాల్లో ఒడుదొడుకులు ఎదురైనపుడు లోలోన కుంగిపోకూడదని.. మన చుట్టూ ఉన్న వారి సాయం తీసుకోవాలని సమంత సూచించింది.

తన జీవితంలో కూడా కఠిన దశను ఎదుర్కొన్నానని.. అలాంటపుడు తన సన్నిహితులే తనకు అండగా నిలిచారని ఆమె తెలిపింది. మనం మానసికంగా ఇబ్బంది పడుతున్నపుడు సన్నిహితుల నుంచి సాంత్వన పొందడం చాలా అవసరం అని.. మొహమాట పడకుండా అలాంటి సమయాల్లో దగ్గరి వాళ్లతో మాట్లాడాలని సమంత పేర్కొంది.

అంతే కాక అవసరమైనపుడు మానసిక వైద్యుల సాయం పొందడం కూడా చాలా అవసరమని సమంత పేర్కొంది. మానసిక చికిత్సా కేంద్రాల అవసరం చాలా ఉందని కూడా సమంత అభిప్రాయపడింది. తన వ్యక్తిగత జీవితం గురించి.. డిప్రెషన్ సమస్యల గురించి మాట్లాడుతున్నపుడు సమంత కొంత ఎమోషనల్ అయింది. ఆమె కళ్లల్లో కాస్త నీళ్లు కూడా కనిపించాయి. విడాకుల తర్వాత ఎంత ఇబ్బంది పడ్డప్పటికీ.. త్వరగానే ఈ ఫేజ్ నుంచి బయటపడి సినిమాల్లో బిజీ అవడం ద్వారా కోలుకున్నట్లే కనిపిస్తోంది.