తమిళ తంబి సుకుమార్


తెలుగులో ఉన్న సృజనాత్మక దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ముందు తరంలో కృష్ణవంశీని ఎలా క్రియేటివ్ డైరెక్టర్ అనేవాళ్లో.. ఇప్పుడు సుకుమార్‌ను అలాగే కొనియాడుతుంటారు అందరూ. ఆయన ప్రతి సినిమా కూడా రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది. టెంప్లేట్ మాస్ మసాలా సినిమాలు ఆయన తీయరు. ఆయన సినిమాల్లో మాస్ ఉంటుంది కానీ.. అందులో ఒక డిఫరెంట్ టచ్ ఉంటుంది. నాన్నకు ప్రేమతో వరకు ఆయన అర్బన్ టచ్ ఉన్న సినిమాలే చేయగా.. ‘రంగస్థలం’ నుంచి రూటు మార్చారు. గ్రామీణ నేపథ్యంలో రస్టిక్ టచ్ ఉన్న సినిమాలు చేస్తున్నారు. ఈ విషయంలో తనకు స్ఫూర్తి తమిళ చిత్రాలు, అక్కడి దర్శకులే అంటున్నాడు సుకుమార్.

‘పుష్ప’ తమిళంలోనూ సూపర్ హిట్టయిన నేపథ్యంలో ఒక ప్రముఖ తమిళ మ్యాగజైన్‌కు సుకుమార్ ఇంటర్వ్యూలో ఇచ్చారు. ఈ సందర్భంగా తమిళంలో, అలాగే మలయాళంలో చాలా కొత్త తరహా సినిమాలు వస్తుంటాయని, ఇక్కడ తీసే వైవిధ్యమైన సినిమాలన్నీ తాను చూస్తుంటానంటూ అక్కడి సినిమాలు, దర్శకుల గురించి చాలా లోతుగా మాట్లాడాడు సుకుమార్.

అమీర్ తీసిన ‘పరుత్తి వీరన్’ తనను ఎంతగానో ప్రభావం చూపిందని.. రంగస్థలం, పుష్ప సినిమాలకు అలాంటి తమిళ చిత్రాలే స్ఫూర్తి అని సుకుమార్ తెలిపాడు. అలాగే వెట్రిమారన్, బాలా అన్నా తనకెంతో అభిమానం అని సుకుమార్ తెలిపాడు. తాను దర్శకుడు కావడానికి కారణమే మణిరత్నం అని చెప్పిన సుకుమార్.. తాను సినిమాల్లో ఓనమాలు నేర్చుకుంది మద్రాస్‌లోనే అని వెల్లడించాడు. ఎడిటర్ మోహన్ దగ్గర తాను మూడేళ్లు పని చేశానని.. ఆ టైంలో మద్రాస్‌లోనే ఉన్నానని.. తనతో పాటు బొమ్మరిల్లు భాస్కర్, మోహన్ రాజాలకు ఎడిటింగ్‌లో మోహన్ విలువైన పాఠాలు నేర్పించారని.. ఇక్కడి సినిమాలు తనను అప్పట్నుంచే ఇన్‌స్పైర్ చేసేవని తెలిపాడు.

నిజానికి తన తొలి చిత్రం ‘ఆర్య’ రిలీజైనపుడు రెండేళ్ల పాటు టాలీవుడ్లో అందరూ తనను తమిళ దర్శకుడే అనుకున్నట్లు సుకుమార్ తెలిపాడు. తెలుగులో సుకుమార్ అనే పేరు ఎవరూ పెట్టుకోరని.. తమిళం, మలయాళంలోనే ఎక్కువగా ఈ పేరుంటుందని.. దీంతో తనను అందరూ తమిళుడనుకుని తమిళంలోనే మాట్లాడేవారని.. ఐతే తనది తూర్పుగోదావరి జిల్లా అని, తాను తెలుగువాడినే అని చెప్పకోవాల్సి వచ్చేదని సుకుమార్ వెల్లడించాడు. తన ప్రతి సినిమాకూ తెలుగులో డివైడ్ టాక్ వస్తుందని.. అంతే కాక ఈ సినిమా తమిళంలో రిలీజైతే సూపర్ హిట్ అవుతుందని కామెంట్లు వినిపిస్తుంటాయని.. ఐతే ఇప్పుడు నిజంగా ‘పుష్ప’ తమిళంలో విడుదలై సూపర్ హిట్ కావడం సంతోషంగా అనిపిస్తోందని చెప్పాడు.