మెగాస్టార్ రేంజ్.. 5 బ్లాక్ టిక్కెట్లు రూ.10 వేలు

ఇంద్ర.. ఈ పేరెత్తితే చాలు మెగా అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. 2002లో విడుదలైన ఈ మెగాస్టార్ మూవీ అప్పటి తెలుగు సినిమా రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అప్పట్లోనే ఈ చిత్రం 30 కోట్ల దాక షేర్ రాబట్టి ఔరా అనిపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ ప్రభంజనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిరు చేసిన ఏకైక ఫాక్షన్ బ్యాక్‌డ్రాప్ మూవీ ఇది.

ఫ్యాక్షన్ సినిమాలంటే బాలయ్యకే చెల్లు అనుకున్నారు కానీ.. చిరు ఈ బ్యాక్‌డ్రాప్‌లో బాలయ్యను మించిన ప్రభంజనాన్ని సృష్టించారు. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో చిరు అభినయం.. అందులో చెప్పిన పవర్ ఫుల్ డైలాగులు.. పాటల్లో అదిరిపోయే డ్యాన్సులు.. ఆ సినిమా చుట్టూ నెలకొన్న గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు అభిమానులు. ఈ చిత్ర దర్శకుడు బి.గోపాల్ కూడా తాజాగా ఒక ఇంటర్వ్యూలో ‘ఇంద్ర’ ప్రభంజనం గురించి గుర్తు చేసుకున్నారు. ఇంద్ర సినిమా తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని అనుభవమని బి.గోపాల్ అన్నారు.

ఆ సినిమా షూటింగ్ రోజులు ఇంకా తనకు గుర్తున్నాయని, ముఖ్యంగా కాశీ షెడ్యూల్‌ గొప్పగా సాగిందని గోపాల్ చెప్పారు. ఈ సినిమాలో చిరంజీవి పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని.. మొక్కే కదా పీకేస్తే పీక కోస్తా, తప్పు మా వైపు ఉంది కాబట్టి తల దించుకుని వెళ్లిపోతున్నా లేకుంటే తలలు తీసుకెళ్లేవాడిని లాంటి డైలాగులను చిరంజీవి అద్భుతంగా చెప్పారని.. ఇక దాయి దాయి దామ్మా పాటలో ఆయన వేసిన స్టెప్పులు సెన్సేషన్ క్రియేట్ చేశాయని చెప్పుకొచ్చారు గోపాల్. ఈ సినిమా రిలీజ్ టైంలో కలెక్షన్లు, థియేటర్ల దగ్గర ప్రభంజనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని.. అప్పట్లో దాని గురించి వచ్చిన వార్తలన్నీ విని ఆశ్చర్యపోయానని చెప్పారు గోపాల్.

మామూలుగా బ్లాక్‌లో టికెట్లు మహా అయితే 500 పెట్టి కొనేవారని.. కానీ మదనపల్లిలో ఒక వ్యక్తి పది వేల రూపాయల కట్ట ఇచ్చి 5 టికెట్లు తీసుకున్నారని తెలిసి షాకయ్యానని గోపాల్ తెలిపారు. ఆ టైంలో ఒక లేడీ ఐపీఎస్ అధికారి తమకు ఒక డిన్నర్ ఇచ్చారని.. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మామూలుగా కొత్త సినిమాలు రిలీజైతే ఎస్సై స్థాయి అధికారులు వెళ్లి జనాలను కంట్రోల్ చేస్తారని, కానీ ‘ఇంద్ర’ సినిమాకు మాత్రం ఎస్పీ స్థాయిలో ఉన్న తాను వెళ్లి జనాలను కంట్రోల్ చేయాల్సి వచ్చిందని చెప్పారని గోపాల్ గుర్తు చేసుకున్నారు.