2022లో రాధేశ్యామ్.. జ్యోతిష్యులు చెప్పారట

‘బాహుబలి’ కోసం ఐదేళ్లకు పైగా సమయాన్ని వెచ్చించాడు ప్రభాస్. దీని తర్వాత వేగంగా సినిమాలు చేయాలని ప్రయత్నించినా కుదరలేదు. ‘సాహో’ కోసం రెండేళ్లకు పైగానే సమయం పెట్టాల్సి వచ్చింది. ‘రాధేశ్యామ్’ను అయినా ఫాస్ట్‌గా చేయాలనుకుంటే.. కరోనా, ఇతర కారణాలతో ఆ సినిమా సైతం ఆలస్యమైంది.

ముందు అనుకున్న ప్రకారం అయితే గత ఏడాదే ‘రాధేశ్యామ్’ రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదాలు పడి.. చివరికి 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐతే ఈ సినిమా 2022లోనే విడుదలవుతుందని కొన్నేళ్ల ముందే జ్యోతిష్యులు చెప్పారట. ఈ విషయాన్ని దర్శకుడు రాధాకృష్ణకుమార్ వెల్లడించడం విశేషం.

‘రాధేశ్యామ్’ కథ జ్యోతిష్యం చుట్టూ తిరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధునిక జ్యోతిష్యుడిగా కనిపించబోతున్నాడు. ఈ పాత్రను తీర్చిదిద్దే క్రమంలో రాధాకృష్ణ కుమార్.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర ఇలా పలు రాష్ట్రాల్లో ప్రముఖ జ్యోతిష్యుల్ని కలిశాడట.

అందులో ఒకరు కొన్నేళ్ల ముందే.. ఈ చిత్రం 2022లో విడుదల అవుతుందని చెప్పారట. అప్పుడు తాను నమ్మలేదని, చివరికి ఈ చిత్రం ఆయనన్నట్లే 2022లో విడుదలవుతోందని రాధాకృష్ణ కుమార్ తెలిపాడు. జ్యోతిష్యం, విధికి సంబంధించి వేల సంవత్సరాల నుంచి అనేక ప్రశ్నలు ఉన్నాయని.. ఐతే ఈ చిత్రంలో తాను ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదని.. కానీ ఆ ప్రశ్నలకు తన వివరణ మాత్రం ఇవ్వబోతున్నానని రాధాకృష్ణ తెలిపాడు.

‘రాధేశ్యామ్’ సినిమా ట్రైలర్ చూసి చాలామంది విజువల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నారని.. ఆ క్రెడిట్ అంతా కమల్ కణ్ణన్ టీంకే చెందుతుందని.. ఈ సినిమా వీఎఫెక్స్ పనులు 12 దేశాల్లో జరుగుతున్నాయని రాధాకృష్ణ వెల్లడించాడు.