సమంత ఐటమ్ సాంగ్ పాడిన సింగర్ ఎవరు?

సినిమా మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు అంచనాలు అంతకంతకూ పెరిగిపోతూ.. తరచూ హాట్ టాపిక్ గా మారిన సినిమాగా అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ను చెప్పాలి. ఈ సినిమాలో బన్నీ డైలాగ్.. షూటింగ్ దశలోనే ఎంతలా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న పుష్ప మూవీ హవా ప్రస్తుతం నడుస్తోంది. రిలీజ్ కు ముందే పాటలు.. ట్రైలర్.. డైలాగులు.. అభిమానుల్ని అలరించటమే కాదు.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న ఆత్రుత అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

ఈ మూవీ కోసం ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు.. కోలీవుడ్.. మాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ మొదటి భాగం డిసెంబరు 17న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీలో ఐటమ్ సాంగ్ ను సమంత ఆడటం.. ఊర మాస్ స్టెప్పులతో అదిప్పుడు హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే. ‘‘ఊ అంటావా.. ఊహు అంటావా’ అనే ఈ పాటకు గాత్రాన్ని అందించిన సింగర్ ఎవరన్న ఆసక్తి ఎక్కువ అవుతోంది. గమ్మత్తుగా ఉన్న ఆమె వాయిస్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

చంద్రబోస్ రాసిన పాటను పాడింది ఇంద్రావతి చౌహాన్. తన గొంతుతో ఈ పాటను మరో స్టేజ్ కు తీసుకెళ్లింది. ఇంతకూ ఈమె ఎవరు? అంటే.. ప్రముఖ సింగర్ మంగ్లీ చెల్లెలు. ఈమె కూడా జానపద పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో జార్జిరెడ్డి మూవీకి పాడారు. తాజా పాటతో ఒక్కసారిగా ఆమె గురించి వివరాల సేకరణ ఎక్కవ కావటమే కాదు.. ఆమె గురించి తెలుసుకునేందుకు ఆసక్తి వ్యక్తమవుతోంది.