‘వెన్నుపోటు’పై బాలయ్య ఎమోషనల్ రియాక్షన్

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ షో మొదలైన దగ్గర్నుంచి హాట్ టాపిక్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ షో బాలయ్యలో కొత్త కోణాన్ని జనాలకు పరిచయం చేస్తోంది. ఆయన ఇంత హుషారుగా, ఇంత సరదాగా, ఏ తడబాటూ లేకుండా ఈ షోను నడిపిస్తారని ఎవరూ అనుకోలేదు. ఇక షోలో కొన్ని వివాదాస్పద విషయాల మీద బాలయ్య ఓపెన్ అయిపోతుండటం, తనదైన శైలిలో స్పందిస్తుండటం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

అందులో రాజకీయాలతో ముడిపడ్డ సంచలన విషయాలు కూడా ఉంటున్నాయి. షో తొలి ఎపిసోడ్లో మోహన్ బాబు బాలయ్యకు ఒక ఇబ్బందికర ప్రశ్న వేశారు. ఎన్టీఆర్ తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు నువ్వెందుకు తీసుకోలేదు అని అడిగాడు. దానికి బదులుగా తెలుగుదేశం పుట్టిందే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా అని, అందుకే తాము ఆ పార్టీ పగ్గాలు తీసుకోలేదని చెబుతూ.. చంద్రబాబు సమర్థత గురించి మాట్లాడాడు బాలయ్య.

ఇప్పుడేమో మరో వివాదాస్పద విషయం గురించి బాలయ్య ఓపెన్ అయిపోయాడు. ఈ షోలో అఖండ టీం సభ్యులైన బోయపాటి శ్రీను, శ్రీకాంత్, ప్రగ్యా జైశ్వాల్‌తో బాలయ్య కొత్త ఎపిసోడ్ చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఆ ప్రోమో చాలా వరకు సరదాగా సాగిపోయింది కానీ.. చివర్లో ఎమోషనల్ టర్న్ తీసుకుంది. చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాడనే ఆరోపణల గురించి బాలయ్య స్పందించాడు. అందరూ వెన్నుపోటు అంటుంటారని, తప్పుడు ప్రచారం చేస్తుంటారని.. కానీ అబద్ధమని బాలయ్య అన్నాడు.

దీని గురించి మాట్లాడుతుంటే తనకు కన్నీళ్లు వచ్చేస్తున్నాయంటూ బాలయ్య ఎమోషనల్ అవడం గమనార్హం. తాను ఎన్టీఆర్‌ కొడుకుల్లో ఒకడినే కాదని.. ఆయన అభిమానుల్లో కూడా ఒకడిని అంటూ.. బాలయ్య ఈ విషయం గురించి వివరించబోవడం కనిపించింది. అంతటితో ప్రోమో కట్ చేశారు. ఈ ప్రోమో చూడగానే బాలయ్య ‘వెన్నుపోటు’ గురించి ఏం మాట్లాడి ఉంటాడో తెలుసుకోవాలన్న కుతూహలం అందరిలోనూ కలుగుతోంది. ఫుల్ ఎపిసోడ్ కోసం అందరూ ఎదురు చూసేలా చేసిందీ ప్రోమో.