‘అఖండ’కు ఊహించని ప్రశంస

నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం ‘అఖండ’ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రతి చోటా సంచలనం రేపుతోంది. తొలి ఆట నుంచి సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. బాలయ్య కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడం లాంఛనమే కావచ్చు. ఈ సినిమాకు మొదట డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. దాంతో సంబంధం లేకుండా వసూళ్లు వస్తున్నాయి.

ఈ క్రమంలో సినిమాపై సినీ, రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరుగా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి ఊహించని వ్యక్తి నుంచి ప్రశంసలు దక్కాయి. ఆ వ్యక్తి బాలయ్య బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కావడం గమనార్హం. చాలా ఏళ్ల నుంచి రాజకీయంగా బాలయ్యకు, వెంకటేశ్వరావుకు వైరం ఉంది. ఒక సమయంలో ఇద్దరికీ మాటలు కూడా లేని పరిస్థితి కూడా ఉంది. గత రెండు దశాబ్దాల్లో ఒకరి గురించి ఒకరు బహిరంగంగా పాజిటివ్‌గా మాట్లాడిన దాఖలాలు దాదాపు కనిపించవు.

ఐతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ‘అఖండ’ చూసి.. బాలయ్యను, ఆ చిత్రాన్ని కొనియాడుతూ ఫేస్ బుక్‌లో ఆసక్తికర పోస్టు పెట్టారు. అందులో ఆయన.. ‘‘అఖండ.. దేవుని మీద విశ్వాసం లేని వాళ్లకు కూడా తమ విశ్వాసం మీద డౌట్ వస్తుంది. హిందూత్వం ,హిందూ తత్వం గురించి ఎంత మంది సాములోళ్లు చెప్పిన అంతగా హత్తుకొననిది హత్తుకునేటట్లు గా చేస్తుంది. గుళ్ళు, గోపురాళ్లకు వివరణ ఇస్తుంది. హోమం ఎందుకు అని చెప్తుంది. బోయపాటి శివతత్వం పరమార్ధాన్ని, హిందూత్వాన్ని రీసెర్చ్ చేశాడని తెలుస్తుంది.

ప్రకృతిలో యురేనియం అంటే ఏమిటి, దాని లాభనష్టాలు, జాగ్రత్తల గురించి ఎంత చదివిన తెలియని వారికి క్లుప్తీకరిస్తుంది. బాలయ్య తన సినిమా జీవితంలో గౌతమీపుత్ర శాతకర్ణితో తన నటన పరాకాష్టకు చెందింది అనుకునేవాడిని. తదుపరి అంతకుమించి సాధ్యపడదని అనుకున్నాను. కానీ నేడు “మించాడు”. బోయపాటి, తమన్ లు ఈ చిత్రానికి ప్రాణం పోయగా ఆ ప్రాణిగా బాలయ్య జీవించి సార్థకం చేశాడు. చివరిగా కరోనా జబ్బుతో మూల పడ్డ చిత్రసీమకు మందు వేసినట్లే. “అహింసా పరమో ధర్మః ధర్మ హింసా సజీవచా ” అంటూ ముగించారు.