బ్రహ్మానందం అంత కఠినంగా ఎందుకుంటాడంటే..

బ్రహ్మానందం పారితోషకం విషయంలో చాలా కఠినంగా ఉంటాడని.. టైమింగ్స్ విషయంలోనూ అస్సలు రాజీ పడడని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. ఈ విషయంలో ఆయన గురించి ప్రతికూల వ్యాఖ్యలు కూడా వినిపిస్తుంటాయి. వేరే నటుల్లా ఆయన టైమింగ్స్ విషయంలో, రెమ్యూనరేషన్ విషయంలో అస్సలు సర్దుబాటు చేసుకోరన్నది ఆయన గురించి వినిపించే కంప్లైంట్. ఇవే విషయాలను కమెడియన్ ఆలీ నిర్వహించే టాక్ షోలో బ్రహ్మానందంను అడిగితే ఆయన ముక్కుసూటిగా సమాధానం చెప్పారు.

డబ్బు విషయంలో, టైమింగ్స్ విషయంలో తాను కచ్చితంగా ఉంటానన్న మాట వాస్తవమే అని.. కానీ అందుకు కారణాలు లేకపోలేదని బ్రహ్మి వివరణ ఇచ్చారు. ఈ విషయంలో బ్రహ్మి ఏమన్నారంటే..‘‘సినీ పరిశ్రమంలో ప్రతి ఒక్కరూ డబ్బుకు విలువ ఇవ్వాలి. డబ్బును మనం ప్రేమిస్తే, గౌరవిస్తే అది మనల్ని ప్రేమిస్తుంది. గౌరవిస్తుంది. రాజనాల, కాంతారావు, సావిత్రి లాంటి మహా నటులు కోట్లు సంపాదించారు. చివరికి ఏమీ లేని స్థితికి వెళ్లిపోయారు. పెద్ద వాళ్ల నుంచి ఏం నేర్చుకోవాలో, ఏం నేర్చుకోకూడదో తెలుసుకోవాలి. ఈ మధ్య కరోనా వచ్చింది. చాలామంది ఎవరు సాయం చేస్తారా అని చూశారు.

డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండదు. అందుకే నేను డబ్బుకు విలువ ఇస్తా. పారితోషకాల విషయంలో నిక్కచ్చిగా ఉంటా. ఇక చాలామంది ‘బ్రహ్మానందం 9 గంటలకు వస్తాడండీ. ఆరు గంటల తర్వాత వెళ్లిపోతాడండీ. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు పనిచేయడండీ’ అంటారు. ఇది నూటికి నూరుపాళ్లు నిజం. 35 ఏళ్ల పాటు రోజుకు మూడు నాలుగు షిఫ్టులు పని చేశా. రోజూ మూడు రాష్ట్రాల్లో పని చేసిన సందర్భాలున్నాయి.

తిని, తినక తిప్పలు పడి.. తిన్నది అరగక వాంతులు అయిన పరిస్థితులు కూడా ఎదుర్కొన్నా. ఇంత కాలం శరీరం కష్టపడ్డ తర్వాత దానికి కూడా విశ్రాంతి ఇవ్వాలి కదా. డబ్బులు వస్తున్నాయి కదా అని ఎలా పడితే అలా షూటింగ్స్ చేయకూడదు. శరీరాన్ని కాపాడుకోవాలి. అందుకే ‘ఈ సమయానికే వస్తా. ఇప్పటి వరకే పని చేస్తా. ఇష్టమైతే పెట్టుకోండి. లేకపోతే లేదు’ అని చెప్పి నన్ను నేను తగ్గించుకున్నా’’ అని బ్రహ్మి వివరణ ఇచ్చాడు.