సింగరాయ్ ప్రమోషనల్ ప్లాన్స్ పీక్స్

ప్రతి సినిమాకీ ప్రమోషన్ అవసరమే. జనాల్ని థియేటర్‌‌కి రప్పించాలంటే ముందు జనాల్ని అట్రాక్ట్ చేయాలి. అందుకే ఫస్ట్ లుక్కులు, టీజర్లు, ట్రైలర్లు అంటూ అప్‌డేట్స్‌తో ఆకట్టుకుంటారు మేకర్స్. అయితే శ్యామ్ సింగ రాయ్‌ టీమ్ తీరే వేరు. వారి ప్రమోషనల్ ప్లాన్స్ పీక్స్‌లో ఉన్నాయి.

నాని హీరోగా డెబ్భైల కాలం నాటి కథతో, కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తీసిన సినిమా ఇది. నాని మేకోవర్ దగ్గర్నుంచి మూవీ మేకింగ్ వరకు ప్రతి విషయంలోనూ ప్రత్యేకత చూపించడానికి ట్రై చేశాడు డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్. అది ప్రతి పోస్టర్‌‌లోను, టీజర్‌‌లోను, పాటలోను కనిపిస్తోంది. నాని కూడా ఈ పాత్రని ప్రాణం పెట్టి చేశాడని అర్థమవుతోంది. నానికి మొదటి ప్యాన్‌ ఇండియా చిత్రం, మొదటి పీరియాడికల్ ఫిల్మ్ కావడంతో అతని కెరీర్‌‌లో ఇదో ప్రత్యేక చిత్రంగా నిలవబోతోంది. అందుకే ప్రమోషన్ విషయంలో ఏమాత్రం రాజీ పడటం లేదు టీమ్.

ఇప్పటికే తరచూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇకపై దీన్ని మరింత పెంచబోతున్నారు. ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి ఇండియాలోని మేజర్ సిటీస్ అన్నీ తిరగబోతున్నారట. ఎక్కడికక్కడ జనాన్ని కలిసి, వారి దృష్టికి తమ సినిమాని తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. అలాగే మూడు వేల మంది అభిమానులతో ఓ ఫ్యాన్‌ మీట్ ఏర్పాటు చేసే ప్లాన్స్‌లో ఉన్నారట. అక్కడ నాని తన అభిమానులతో ముచ్చటిస్తాడట. వాళ్లు అడిగే ప్రశ్నలకి జవాబులిస్తాడట. వారితో కలిసి భోజనం కూడా చేస్తాడట. ఇక ప్రెస్‌మీట్లు, ట్రైలర్‌‌ రిలీజ్, ప్రీ రిలీజ్ లాంటివి మామూలే.

ఇవన్నీ చూస్తుంటే సినిమా ప్రమోషన్స్ విషయంలో చాలా కచ్చితమైన ప్లాన్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. నాని రెగ్యులర్ ఫిల్మ్స్‌లా కాకుండా ఇది కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీసిన సినిమా. కోల్‌కతాలో ఒకప్పుడు మహిళల స్థానం మీద, వాళ్లు ఫేస్ చేసిన సమస్యల మీద తీసిన సినిమా అని, వారి కోసం జర్నలిస్ట్ అయిన నాని పోరాడతాడని తెలుస్తోంది. ఇలాంటి సెన్సెటివ్‌ ఇష్యూస్‌తో కూడిన కాన్సెప్ట్స్‌కి జనాలు బాగా కనెక్టవుతారు. అయితే ఓ తెలుగు సినిమాకి, నానిలాంటి లోకల్ బోయ్ ఇమేజ్‌ ఉన్న హీరోకి ప్యాన్ ఇండియా అప్పీల్‌ రావాలంటే ఈ రేంజ్ ప్రమోషన్ అవసరమే మరి.