భీమ్లా త‌గ్గ‌లేదు.. అందుకేనా?

భీమ్లానాయ‌క్ సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకునే సంకేతాలు ఎంత‌మాత్రం క‌నిపించ‌డం లేదు. సంక్రాంతి రిలీజ్ ప‌క్కా అనే విష‌యాన్ని చిత్ర బృందం మ‌ళ్లీ మ‌ళ్లీ నొక్కి వ‌క్కాణిస్తూనే ఉంది. ఐదు రోజుల కింద‌ట కొత్త పోస్ట‌ర్ రిలీజ్ చేసి ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించారు. రెండు రోజుల త‌ర్వాత పీఆర్ సంస్థ‌ల‌తో ఈ మేర‌కు ట్వీట్లు వేయించారు. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్టైన్మెంట్స్ ట్విట్ట‌ర్ హ్యాండిల్లో సినిమా ఎడిటింగ్ జ‌రుగుతున్న గ‌దిలో ఒక విజువ‌ల్ చూపిస్తూ సంక్రాంతి విడుద‌ల ప‌క్కా అన్న విష‌యాన్ని తేల్చి చెప్పారు. ఈ సినిమాను వాయిదా వేయించ‌డానికి అగ్ర నిర్మాత దిల్ రాజు నేతృత్వంలో ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్.. భీమ్లా నాయ‌క్ టీంను క‌లుస్తున్న‌ట్లు నాలుగైదు రోజుల కింద‌టే వార్త‌లు రావ‌డం తెలిసిందే.

రాజు రంగంలోకి దిగాడంటే క‌చ్చితంగా ప‌నైపోతుంద‌నే అనుకున్నారు. కానీ ఎవ్వ‌రేం చెప్పినా భీమ్లా నాయ‌క్ టీం లొంగ‌ట్లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.
సంక్రాంతి సీజ‌న్‌ను వ‌దులుకుంటే జ‌రిగే న‌ష్ట‌మేంటో తెలిసే భీమ్లా నాయ‌క్ టీం ఆ సీజ‌న్లోనే సినిమాను రిలీజ్ చేయాల‌నే ప‌ట్టుద‌ల‌కు వెళ్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. సంక్రాంతి సినిమాల‌కు ఎగ్జిబిట‌ర్లు టికెట్ల రేట్లను ఎలా పెంచుకున్నా తాము జోక్యం చేసుకోబోమంటూ ఏపీ మంత్రి పేర్ని నాని ఇటీవ‌ల పేర్కొన్న‌ట్లుగా వార్త‌లొస్తున్న సంగతి తెలిసిందే.

ఏపీలో టికెట్ల రేట్ల గొడ‌వ మొద‌లైందే ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా వ‌కీల్ సాబ్‌తో. అప్ప‌ట్నుంచి నిర్మాత‌లు కిందా మీదా ప‌డుతున్నారు. వాళ్లు వేడుకున్నా.. ప‌వ‌న్ హెచ్చ‌రించినా అక్క‌డ ప‌రిస్థితి మార‌లేదు. కొత్త‌గా తెస్తున్న ఆన్ లైన్ టికెటింగ్ యాప్ రెడీ అయ్యాక కానీ టికెట్ల రేట్లు రివైజ్ చేసే అవ‌కాశం లేద‌ట‌.

ఐతే సంక్రాంతికి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి భారీ, పాన్ ఇండియా సినిమాలు రిలీజ‌వుతుండ‌టంతో ఆ చిత్ర బృందాలు ప్ర‌భుత్వం మీద గ‌ట్టిగా ఒత్తిడి తెచ్చో, లీగ‌ల్‌గా ట్రై చేసో టికెట్ల రేట్లు పెంచుకోవ‌డం ప‌క్కా అనే అంచనాలున్నాయి. ప‌వ‌న్ సినిమా సోలోగో వ‌స్తే మ‌రోసారి జ‌గ‌న్ ప్ర‌భుత్వం దాన్ని టార్గెట్ చేయొచ్చు. అందుకే సంక్రాంతికి వ‌స్తే అంద‌రికీ కామ‌న్‌గా ఒకే విధానం ఉంటుంది, సంక్రాంతి వ‌ర‌కు టికెట్ల రేట్ల‌ను పెంచుకునే సౌల‌భ్యం క‌ల్పిస్తే భీమ్లా నాయ‌క్‌కు కూడా ఆ అవ‌కాశం ద‌క్కుతుంది. అందుకే సంక్రాంతి రిలీజ్ విష‌యంలో భీమ్లా నాయ‌క్ టీం త‌గ్గ‌ట్లేద‌ని స్ప‌ష్ట‌మవుతోంది.