వాకింగ్ కు వెళ్లిన నటిపై దాడి.. గాయాలు

హైదరాబాద్ మహానగరంలో వీఐపీలు.. ప్రముఖులు.. సెలబ్రిటీలు.. సామాన్యులు ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు వాకింగ్ చేసే ప్రాంతం కేబీఆర్ పార్కు. ప్రధాన రోడ్డు పక్కనే ఉండే ఈ పార్కుకు వాకింగ్ చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వస్తుంటారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న పార్కు వద్ద వాకింగ్ చేయటానికి వచ్చిన నటిపై దాడి జరగటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఉదంతం ఆదివారం సాయంత్రం జరగ్గా.. ఆలస్యంగా బయటకు వచ్చింది.

ప్రస్తుతం దాడికి గురైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెబుతున్నారు. బంజారాహిల్స్ పోలీసులకు బాధితురాలైన నటి చౌరాసియా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చూస్తే.. ఆదివారం సాయంత్రం చౌరాసియా కేబీఆర్ పార్కు వద్దకు వాకింగ్ కోసం వెళ్లారు. ఆ సమయంలో ఆమెపై ఒక గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. ఆమె చేతిలో ఉన్న ఐఫోన్ ను లాక్కెళ్లాడు.

తన ఫోన్ ను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న దుండగుడితో నటి చౌరాసియా అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమెపై దాడి చేయటమే కాకుండా.. రాయికి ఆమెను బలంగా కొట్టినట్లుగా ఆమె చెబుతున్నారు. దుండగుడి కారణంగా గాయాలు కావటంతో ఆమె కింద పడిపోయారు. ఫోన్ ను దొంగలించిన అతను పారిపోయాడు.

అనంతరం డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. దాడిలో గాయపడిన నటిని ఒక ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమెకు గాయాలు అయినట్లు చెబుతున్నా.. దాని తీవ్రత ఎంతన్న విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ప్రముఖులు పెద్ద ఎత్తున వచ్చే పార్కు వద్ద ఈ ఘటన జరగటం సంచలనంగా మారింది.