రజినీని మోస్తున్న తమిళ మీడియా

ఒకప్పుడు తమిళ సినిమాలంటే కొత్తదనానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవి. అక్కడ ఎన్నో మంచి మంచి ప్రయోగాలు జరిగేవి. వాటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరొచ్చేది. తమిళ సినిమాల గురించి భాషా భేదం లేకుండా అందరూ మాట్లాడుకునేవారు. స్టార్ హీరోలు సైతం ప్రయోగాత్మక కథలతో సినిమాలు చేసేవారు. కమర్షియల్ సినిమాల్లోనూ అంతో ఇంతో కొత్తదనం కచ్చితంగా ఉండేది. తమిళ సినిమాలను చూసి నేర్చుకోవాలని ఇతర భాషల ఇండస్ట్రీల్లో చర్చ జరిగేది.

తమిళం నుంచి వచ్చిన అనువాద చిత్రాలు వేరే భాషల్లో చాలా బాగా ఆడేవి. ముఖ్యంగా తెలుగులో తమిళ అనువాదాలకు బ్రహ్మరథం పట్టేవారు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. టాలీవుడ్లో ఎన్నో ప్రయోగాలు జరుగుతుంటే, కొత్త తరహా సినిమాలు వస్తుంటే.. తమిళంలో మాత్రం మూస, మాస్ సినిమాల తాకిడి ఎక్కువైపోయింది. ముఖ్యంగా స్టార్ హీరోలందరూ మాస్ మాస్ అని కొట్టేసుకుంటున్నారు. దర్శకులూ అంతే.

పిజ్జా, జిగర్ తండా లాంటి సినిమాలు చేసిన కార్తీక్ సుబ్బరాజ్ రజినీకాంత్‌తో కలిసి ‘పేట’ లాంటి రొటీన్ సినిమా తీయడం ఇందుకు నిదర్శనం. అలాగే కమర్షియల్ సినిమాల్లోనూ ఎంతో వైవిధ్యం చూపించిన మురుగదాస్ సైతం రజినీతో ‘దర్బార్’ లాంటి రొటీన్ మూవీనే తీశాడు. రజినీనే కాదు.. విజయ్, అజిత్ లాంటి హీరోలు రొటీన్ మాస్ మసాలా సినిమాలకే పరిమితం అవుతున్నారు.

సూపర్ స్టార్ ఇలాంటి సినిమాలను నమ్ముకునే పతనమవుతూ వచ్చాడు. ఇప్పుడు ఆయన్నుంచి వచ్చిన ‘అన్నాత్తె’ పరిస్థితి మరీ దారుణం. 20-30 ఏళ్ల ముందు వచ్చినా ఔట్ డేటెడ్ అనుకునే సెంటిమెంట్ మూవీ ఇది. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా ఎలా చేశారో అర్థం కావడం లేదు. ఇలాంటి సినిమాను తమిళంలో సమీక్షకులు, ట్రేడ్ పండిట్లు, పీఆర్వోలు కలిపి తెగ లేపుతున్నారు. తెలుగులో 1.5, 2 రేటింగ్స్ పడితే.. తమిళంలో పేరున్న సమీక్షకులు 2.5, 2.75 రేటింగ్స్ వేశారు.

ఇక ఆన్ లైన్లో బుకింగ్స్ చూస్తే థియేటర్లన్నీ ఖాళీగా కనిపిస్తుంటే.. అక్కడి పీఆర్వోలేమో హౌస్ ఫుల్స్ అని, వసూళ్ల మోత మోగిపోతోందని అంటున్నారు. రెండు రోజుల్లోనే వంద కోట్ల కలెక్షన్లంటూ ఊదరగొడుతున్నారు. అందరూ మూకుమ్మడిగా ఫేక్ కలెక్షన్ ఫిగర్స్ వేస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. విజయ్, అజిత్ సినిమాల విషయంలోనూ ఇలాగే జరుగుతోంది. ఇలాంటి చిత్రాలను ప్రోత్సహించి తమిళ సినిమాను తిరోగమనంలోకి తీసుకెళ్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.