మలయాళ రీమేక్‌లో నాగార్జున

ఇండస్ట్రీలో రీమేక్‌ల హవా నడుస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో మలయాళ సినిమాలపై మోజు పెరిగింది. స్టార్ హీరోలు సైతం మాలీవుడ్ రీమేక్స్‌లో నటించడానికి మనసు పడుతున్నారు. చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్‌ ‘గాడ్‌ఫాదర్‌‌’లో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్‌’ రీమేక్‌ ‘భీమ్లానాయక్‌’లో యాక్ట్ చేస్తున్నారు. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్, ఓ మై కడవులే వంటి చిత్రాలు కూడా రీమేక్ రేస్‌లో ఉన్నాయి. ఇప్పుడు నాగార్జున కూడా ఓ మలయాళ మూవీ రీమేక్‌లో నటించబోతున్నారనే వార్తలు అందుతున్నాయి.

ఈ యేడు జనవరిలో రిలీజై మంచి సక్సెస్ అయిన ‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్’ సినిమా నాగ్‌కి తెగ నచ్చేసిందట. ఆ మూవీ రీమేక్‌ చేస్తే బాగుంటుందని ఆయన ఆశపడుతున్నారట. నిజానికి నాగ్ మొదట్నుంచీ రీమేక్స్‌పై అంత ఆసక్తి చూపించరు. నటుడిగా, నిర్మాతగా ఎన్నో ప్రయోగాలు చేసిన ఆయన, వీలైనంత వరకు స్ట్రెయిట్ సినిమాలే చేశారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం కచ్చితంగా రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యారట. త్వరలో అనౌన్స్‌మెంట్ కూడా రానుందని టాక్.

‘ద గ్రేట్ ఇండియన్‌ కిచెన్‌’ని జియో బేబి డైరెక్ట్ చేశారు. నిమిష, సూరజ్ లీడ్ రోల్స్ చేశారు. సింపుల్ స్టోరీ. పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో కాపురానికి వచ్చిన అమ్మాయికి ఎదురయ్యే సమస్యల చుట్టూ మూవీ తిరుగుతుంది. ఆమె తన ఇష్టాయిష్టాలను పక్కన పెట్టేసి ఎలా సర్దుకుపోయింది, తన కాపురాన్ని ఎలా తీర్చిదిద్దుకుంది అనేది మెయిన్ పాయింట్. చెప్పుకోడానికి ఏం లేకపోయినా చూడటానికి మాత్రం చాలా ఉందీ సినిమాలో. ఎమోషనల్‌గా, ఎంతో నేచురల్‌గా తీయడంతో ఆడియెన్స్‌ బాగా కనెక్టయ్యారు.

అయితే ఇది కొత్తగా పెళ్లయిన దంపతుల కథ. ‘మన్మథుడు 2’ బెడిసి కొట్టిన తర్వాత నాగ్ వైల్డ్ డాగ్, ద ఘోస్ట్ లాంటి మెచ్యూర్డ్‌ స్టోరీస్ మాత్రమే ఎంచుకుంటున్నట్టు కనిపిస్తోంది. పైగా ఇండియన్ కిచెన్ దాదాపు ఫిమేల్ ఓరియెంటెడ్ స్టోరీలానే ఉంటుంది. హీరోయిన్‌ క్యారెక్టర్, ఆమె కష్టాల చుట్టూనే ఎక్కువ తిరుగుతుంది. మరి అలాంటి స్టోరీలో నాగ్ ఎలా నటిస్తారనేదే ఇప్పుడున్న సందేహం. యాక్ట్ చేయకుండా ఎవరైనా యంగ్‌ హీరోతో నిర్మించే చాన్స్ కూడా లేకపోలేదు. ఏదేమైనా ఈ వార్తల గురించి నాగ్ రియాక్టయితేనో లేక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తేనో తప్ప క్లారిటీ రాదు.