మంచు విష్ణు ఎలా గెలిచాడు?


‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ఎలా గెలిచాడు? ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఇది. కొన్ని రోజుల ముందు వరకు అయితే ‘మా’ అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజే ఫేవరెట్ లాగా కనిపించాడు. అందుక్కారణం.. ఆయనకు చిరంజీవి సహా మెగా ఫ్యామిలీ బ్యాకప్ ఉండటం. ఎన్నికల కోసం అందరికంటే ముందే సన్నాహాలు చేసుకుని, చాలా ముందుగానే ప్యానెల్‌‌ను ప్రకటించి, ప్రెస్ మీట్లు పెట్టి, ‘మా’ సభ్యులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి.. ఎన్నికల రేసులో మిగతా వాళ్లకంటే చాలా ముందున్నట్లుగా కనిపించిన ప్రకాష్ రాజ్.. చివరికిలా ఓడిపోతాడని, అందులోనూ విష్ణుకు 100కు పైగా ఓట్ల ఆధిక్యం వస్తుందని ఎవరూ ఊహించలేదు. ప్రకాష్ రాజ్ బరిలో నిలిచినప్పుడే ‘నాన్ లోకల్’ అనే పాయింట్ తెరపైకి వచ్చింది. కానీ దీని మీద ప్రకాష్ రాజ్ సహా ఆయన మద్దతుదారులు దీటుగా స్పందించి.. ఆ చర్చకు తెరదించినట్లే కనిపించారు. కానీ చివరికొచ్చేసరికి ఆ పాయింటే కీలకంగా మారినట్లు కనిపిస్తోంది.

ఎన్నికలకు కొన్ని రోజుల ముందు రవిబాబు రిలీజ్ చేసిన వీడియో ‘మా’ సభ్యుల్లో బాగానే ఆలోచన రేకెత్తించిందన్నది ఇండస్ట్రీ వర్గాల మాట. ఇప్పటికే ఇండస్ట్రీలో అన్ని విభాగాల్లోనూ నాన్ లోకల్ వాళ్లకు ప్రాధాన్యం ఎక్కువగా ఉందని, మన కోసం మనం పెట్టుకున్న ‘మా’ అసోసియేషన్‌ను కూడా మనం నడుపుకోలేమా, దీనికి కూడా పరాయివాళ్లు కావాలా అంటూ ఆయన లేవనెత్తిన పాయింట్ చర్చనీయాంశమైంది.

అదే సమయంలో కోట శ్రీనివాసరావు, రాజీవ్ కనకాల తదితరులు కూడా విష్ణు ‘మన’ అని, ప్రకాష్ రాజ్ ‘పర’ అని ఫీలింగ్‌ను మరింత పెంచారు. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అనే కాక.. ఆయన అహంభావి, కోపిష్టి అని.. మన వాళ్లకు ఆయన దగ్గర రీచ్ ఉండదని పరిశ్రమ వర్గాల్లో బలంగా అభిప్రాయం ప్రబలేలా చేయగలిగారు. వీటన్నింటికీ మించి ప్రకాష్ రాజ్‌కు మెగా ఫ్యామిలీ బ్యాకప్ ఉన్న నేపథ్యంలో ఇండస్ట్రీలో ‘మెగా’ ఆధిపత్యం చూసి అసూయ చెందే, వాళ్లంటేు పడని వాళ్లందరూ ఒక్క తాటిపైకి వచ్చారు. ఇక్కడ ‘కులం’ ఫ్యాక్టర్ సైతం పని చేసినట్లుగా భావిస్తున్నారు.

వీటన్నింటినీ మించి మంచు విష్ణు పోల్ మేనేజ్మెంట్ కూడా కీలకంగా మారింది. పెద్ద టీంను ఏర్పాటు చేసుకుని సభ్యులతో కోఆర్డినేట్ చేసుకోవడం.. ఓటు వేయడానికి వాళ్లకు ఏ రకమైన ఇబ్బందీ లేకుండా ఏర్పాట్లు చేయడం ప్లస్ అయింది. వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్లకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడమే కాక.. వాళ్లను ఎయిర్ పోర్ట్ నుంచి పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి, మళ్లీ ఎయిర్ పోర్ట్ దగ్గర దిగబెట్టడం.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలనుకున్న వారికి అన్నీ దగ్గరుంచి సమకూర్చి పెట్టడం విష్ణుకు కలిసొచ్చినట్లుగా భావిస్తున్నారు.

సభ్యులు ఫ్లైట్ టికెట్లకు, ఈ సాయానికి పడిపోయారా అనిపిస్తుంది కానీ.. ఇక్కడ విషయం డబ్బులు కాదు. మన మీద శ్రద్ధ పెట్టి ఇంత చేశారే అన్న సదభిప్రాయం విష్ణుకు అనుకూలంగా ఓటు వేయడానికి తోడ్పడి ఉండొచ్చు. సభ్యుల్లో ప్రతి ఒక్కరికీ మోహన్ బాబు వ్యక్తిగతంగా ఓపికతో ఫోన్ చేసి ఓటు అడగడం కూడా ప్లస్ అయిందని భావిస్తున్నారు. ఇలా పలు అంశాలు కలిసొచ్చి మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడి పీఠాన్ని అందుకున్నారన్నది విశ్లేషకుల మాట.