వెంకీ పోస్ట్.. దాని గురించేనా!

ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తాన్నీ వేధిస్తున్న ప్రశ్న.. అసలు సమంత, నాగచైతన్య ఎందుకు విడిపోయారు అనే. కొందరు సన్నిహితులు తమకు తెలిసిన కారణాలు చెబుతున్నారు. మరికొందరు తెలుసుకునే చాన్స్ లేక తమకు తెలిసిందే మాట్లాడేస్తున్నారు. దాంతో ఈ విషయంపై కాస్త ఎక్కువే రభసే అవుతోంది. తమకు ప్రైవసీ ఇవ్వమని నాగ్, సామ్ విడాకుల్ని ప్రకటించినప్పుడే కోరారు. అది వారి వ్యక్తిగతం అని నాగార్జున కూడా అన్నారు. అయినా కూడా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతూ ఉండటంతో చివరికి చైతు మేనమామ వెంకటేష్ కూడా రియాక్టయ్యారు.

రీసెంట్‌గా వెంకీ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. అందులో ‘నోరు తెరవడానికి ముందు మనసు తెరవండి’ అని ఉంది. మనసు అనేది ఆలోచనల పుట్ట అని, మనం వెళ్లే మార్గాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలని కూడా వెంకీ మరో పోస్ట్‌లో అన్నారు. ఆయన పోస్టులు క్షణాల్లో వైరల్ అయ్యాయి.

ఇవి కచ్చితంగా చైతు, సమంతల గురించేనని అందరికీ అర్థమయ్యింది. ఏది పడితే అది మాట్లాడేయకుండా, అర్థం లేని కథలు పుట్టించకుండా వాళ్ల మానాన వాళ్లని వదిలేయమని ఒక్క మాటలో భలే చెప్పారంటున్నారు నెటిజన్స్.

నిజమే. చైతు, సమంతలు ఎందుకు విడిపోయారనేది వారి వ్యక్తిగతం. దాని ఫలితం ఏదైనా వాళ్లే భరించాలి, భరిస్తారు. అది మర్చిపోయి ఎవరెవరో మధ్యలో దూరిపోవడం, జడ్జిమెంట్‌ ఇచ్చేయడం సమంజసం కాదు. ఆ విషయాన్ని మర్చిపోవడం వల్లే ఏ విషయంలోనూ కల్పించుకోని వెంకీ కూడా ఇలా ఘాటుగా రియాక్టయ్యారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.