బాహుబ‌లి, పుష్ప బాట‌లో క‌మ‌ల్ సినిమా


బాహుబ‌లి సినిమాను ముందు ఒక చిత్రంగా తీయాల‌నే మొద‌లుపెట్టారు. కానీ మేకింగ్ మ‌ధ్య‌లో రాజ‌మౌళి ఆలోచ‌న మారింది. ఈ క‌థ ప‌రిధి పెద్ద‌ద‌ని.. బ‌డ్జెట్‌, మార్కెట్ లాంటి అంశాలను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఆ చిత్రాన్ని రెండు భాగాలుగా తీయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ముందు ఈ నిర్ణ‌యం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని చాలామంది సందేహాలు వ్య‌క్తం చేశారు కానీ.. చివ‌రికి జ‌క్క‌న్న ప్లాన్ అద్భుతంగా వ‌ర్క‌వుట్ అయింది. రెండు భాగాలూ అద్భుత విజ‌యాన్ని సాధించి సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి.

ఐతే బాహుబ‌లి లాంటి భారీ చిత్రాల‌ను అలా రెండు భాగాలు చేయ‌డం ఓకే కానీ.. ఈ మ‌ధ్య పుష్ప అనే రెగ్యుల‌ర్ మూవీని కూడా 2 పార్ట్స్‌గా తీయ‌డానికి సుకుమార్ సంక‌ల్పించ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. ఈ సినిమాను సైతం ఒక చిత్రంగా తీయ‌డానికి సంక‌ల్పించారు. కానీ మేకింగ్ మ‌ధ్య‌లో ఆలోచ‌న మారిపోయింది. అది కూడా రెండు భాగాలైంది. ఫ‌స్ట్ పార్ట్ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌రు 17న‌ తొలి భాగాన్ని రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఇప్పుడు సౌత్‌లో మ‌రో క్రేజీ మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేయ‌డానికి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్లు స‌మాచారం. ఆ చిత్ర‌మే.. విక్ర‌మ్‌. క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో యువ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ రూపొందిస్తున్న సినిమా ఇది. విజ‌య్ సేతుప‌తి, ఫాహ‌ద్ ఫాజిల్ లాంటి విల‌క్ష‌ణ, మేటి న‌టులు ఇందులో విల‌న్లుగా న‌టిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ఒక భాగంగా తీయాల‌నే మొద‌లుపెట్టారు. కానీ దీని ప‌రిధి కూడా ఎక్కువే కావ‌డం, ఫ‌స్ట్ పార్ట్ నిడివి దాదాపు నాలుగు గంట‌లు వ‌స్తుండ‌టంతో ఇప్పుడు చిత్ర బృందం ఆలోచ‌న‌లు మారుతున్న‌ట్లు స‌మాచారం. దీన్ని రెండు భాగాలుగా తీసి, రిలీజ్ చేయ‌డానికి అవ‌స‌ర‌మైన కంటెంట్ ఉంద‌ని.. అలా చేస్తే క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా బాగా వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని భావిస్తున్నార‌ట‌. దీనిపై లోకేష్‌, క‌మ‌ల్ మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని.. త్వ‌ర‌లోనే తుది నిర్ణ‌యం తీసుకుని.. ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంద‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.