మొన్న పవన్, నిన్న పోసాని, నేడు నట్టి కుమార్

రిపబ్లిక్ సినిమా రిలీజైపోయింది. కానీ ఆ మూవీ ప్రీ రిలీజ్‌ వేడుకతో తలెత్తిన వివాదం నుంచి మాత్రం ఇండస్ట్రీ ఇంకా రిలీజ్ కాలేదు. జగన్ ప్రభుత్వాన్ని పవన్‌ కామెంట్ చేయడం.. ఆయనపై పోసాని ధ్వజమెత్తడం తెలిసిందే. ఇప్పుడీ వివాదంలోకి సడెన్‌గా నట్టికుమార్ ఎంటరయ్యారు.

ఇండస్ట్రీలో ఏం జరిగినా తనంతట తాను స్పందించే వ్యక్తి నట్టికుమార్. ఇప్పుడు పవన్‌, పోసానిల వివాదం గురించి కూడా ప్రెస్‌మీట్ పెట్టి మరీ రియాక్టయ్యారు. పోసాని ఇంటిమీద పవన్ ఫ్యాన్స్ దాడి చేయడాన్ని పూర్తిగా తప్పు పట్టారాయన. ఎవరు మాట్లాడినా మధ్యలోకి కుటుంబాలను తీసుకు రావడం కరెక్ట్ కాదని, తమ హీరోలకు మంచి పేరొచ్చేలా అభిమానులు నడచుకోవాలి తప్ప ఇలాంటి పనులు చేయకూడదని అన్నారు. జనసేన నాయకుడు అనవసరంగా ఆంధ్ర, తెలంగాణ అనే తేడాలు తీసుకొస్తున్నారని, అది చాలా తప్పని ఖండించారు నట్టి కుమార్.

జగన్ అందరినీ ఒకేలా చూసే వ్యక్తి అని చెప్పిన నట్టి కుమార్.. పవన్ పెద్ద స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదని, కానీ ఆయన రాజకీయాలకు ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. కొందరు నిర్మాతలు పవన్‌కి తప్పుడు సమాచారం ఇస్తున్నారని, చాంబర్‌‌ నుంచి రిలీజైన లెటర్ ఎవరో కొందరు మాత్రమే పంపించారు తప్ప అందరూ డిస్కస్ చేసి విడుదల చేసింది కాదని నట్టికుమార్‌‌ అన్నారు. దాంతో ఈ కాంట్రవర్శీ కొత్త టర్న్ తీసుకుంది.