ప‌వ‌న్‌ను చెప్పుతో కొడ‌తా.. చిరును కూడా వ‌ద‌ల‌ని పోసాని..!


పోసాని కృష్ణ‌ముర‌ళీ వ‌ర్సెస్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వివాదానికి ఇప్ప‌ట్లో బ్రేక్ ప‌డుతుందా ? కొద్ది రోజులు కంటిన్యూ అవుతుందా ? అన్న‌ది చెప్ప‌లేకుండా ఉంది. ఎవ్వ‌రూ కూడా వెన‌క్కు త‌గ్గ‌కుండా ప్రెస్‌మీట్లోనో లేదా సోష‌ల్ మీడియాలోనో ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు చేసుకుంటూనే వ‌స్తున్నారు. తాజాగా బుధ‌వారం అర్ధ‌రాత్రి కొంద‌రు వ్య‌క్తులు పోసాని ఇంటిపై రాళ్ల‌తో దాడి చేయ‌డంతో ఈ వివాదం మ‌రింత వేడెక్కింది. త‌న ఇంటిపై రాళ్ల దాడి నేప‌థ్యంలో పోసాని ఓ మీడియాతో మాట్లాడుతూ ప‌వ‌న్‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అంత‌టితో ఆగ‌కుండా చిరంజీవికి కూడా ప‌రోక్షంగా చీవాట్లు పెట్టేశారు. త‌న‌ను బెదిరిస్తూ .. త‌న ఫోన్ల‌కు చంపేస్తానంటూ మెసేజ్‌లు పెడుతోన్న జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లే త‌న ఇంటిపై దాడికి పాల్ప‌డ్డార‌ని ఆయ‌న ఆరోపించారు.

చివ‌ర‌కు త‌న భార్య‌ను కూడా వ‌ద‌ల‌కుండా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, ప‌వ‌న్ అభిమానులు ఇష్ట‌మొచ్చిన‌ట్టు మాట్లాడుతున్నార‌ని.. మెసేజ్‌లు పెడుతున్నార‌ని పోసాని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌తంలో చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన‌ప్పుడు ఇండ‌స్ట్రీలో చాలా మంది మౌనంగా ఉన్నా .. తాను మాత్రం ముందు వ‌రుస‌లో ఉండి.. వీటిని ఖండించాన‌న్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. ప‌వ‌న్ ఎవ‌రిని అయినా ఏమైనా అనొచ్చు.. కానీ ప‌వ‌న్‌ను మాత్రం ఎవ్వ‌రూ ఏమీ అన‌కూడ‌దా ? అని ఫైర్ అయ్యారు.

ఈ విష‌యంలో చిరంజీవి క‌లుగ‌చేసుకుని ప‌వ‌న్‌ను మంద‌లించ‌డంతో పాటు ఆయ‌న ప్రెస్‌మీట్ పెట్టి ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను క‌ట్ట‌డి చేసే కార్య‌క్ర‌మం ఎందుకు చేప‌ట్ట‌రంటూ ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ది ఓ సైకో బుద్ధి అని.. స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాలో ముందుగా త‌న‌ను తీసుకుని.. త‌ర్వాత కావాల‌నే తీసేశార‌ని పోసాని చెప్పారు. ఆ సినిమా షూటింగ్‌లోనే ప‌వ‌న్ ఓ కోడైరెక్ట‌ర్‌ను కొట్టార‌ని… త‌ర్వాత అత‌డి త‌ప్పులేద‌ని తెలిసినా కూడా ప‌వ‌న్ క‌నీసం సారీ చెప్ప‌లేద‌న్నారు.

తాను ఇండ‌స్ట్రీలో 35 ఏళ్ల నుంచి ఉంటున్నాన‌ని.. త‌న‌కు ఎవ్వ‌రితోనూ శ‌త్రుత్వం లేద‌ని ఆయ‌న చెప్పారు. ప‌వ‌న్‌ను తాను ప్ర‌శ్నించినందునే తాను శ‌త్రువును అయిపోతానా ? అని పోసాని ఫైర్ అయ్యారు. తాను ఇలాంటి రాళ్ల దెబ్బ‌ల‌కు, బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేవాడిని కాన‌ని.. త‌న ఫ్యామిలీ జోలికి వ‌స్తే మాత్రం స‌హించ‌న‌ని పోసాని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. ఇదే ప‌రిస్థితులు పున‌రావృతం అయితే తాను ప‌వ‌న్‌ను చెప్పుతో కొడ‌తానంటూ పోసాని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. మ‌హా అయితే ప‌వ‌న్ ఫ్యాన్స్ త‌న‌ను చంపేస్తారేమోన‌ని.. అంత‌కు మించి ఏం చేస్తారంటూ కాస్త ఆవేద‌న‌తోనూ మాట్లాడారు.

ఇదే స‌మ‌యంలో గ‌తంలో యువ‌రాజ్యం అధ్య‌క్షుడి హోదాలో ప‌వ‌న్ కాంగ్రెస్ నేత‌ల‌ను బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌తాన‌న్న కామెంట్ గుర్తు చేశారు. ఇప్పుడు ప‌వ‌న్ ఫ్యాన్స్ కూడా త‌న‌ను బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌తామంటున్నార‌ని.. నాయ‌కుల‌ను బ‌ట్టే కార్య‌క‌ర్త‌లు కూడా ఉంటున్నార‌ని పోసాని మండిప‌డ్డారు. ఏదేమైనా పోసాని ఈ వివాదంలో ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గ‌డం లేద‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది.