త‌లైవి.. రిలీజ్‌కు ముందే లాభాల‌ట‌

క‌రోనా సెకండ్ వేవ్ బ్రేక్ త‌ర్వాత రిలీజైన తొలి పాన్ ఇండియా మూవీ.. త‌లైవి. త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవిత క‌థ ఆధారంగా త‌మిళ ద‌ర్శ‌కుడు ఎ.ఎల్.విజ‌య్ రూపొందించిన ఈ చిత్రానికి తెలుగువాడైన విష్ణువ‌ర్ధ‌న్ ఇందూరి నిర్మాత కావ‌డం విశేషం. కంగ‌నా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర పోషించిన ఈ చిత్రం చాలా కాలం నుంచి విడుద‌ల కోసం ఎదురు చూస్తోంది.

మ‌ధ్య‌లో ఎన్ని ఓటీటీ ఆఫ‌ర్లు వ‌చ్చినా కూడా చిత్ర బృందం టెంప్ట్ కాలేదు. థియేట‌ర్లు పూర్తి స్థాయిలో తెరుచుకునే వ‌ర‌కు ఎదురు చూసి వివిధ భాష‌ల్లో వినాయ‌క చ‌వితి కానుక‌గా ఈ చిత్రాన్ని విడుద‌ల చేశారు. కానీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ చిత్రానికి చేదు అనుభ‌వం త‌ప్ప‌లేదు. హిందీలో ఈ చిత్రానికి వ‌స్తున్న వ‌సూళ్లు థియేట‌ర్ల మెయింటైనెన్స్ ఖ‌ర్చుల‌కు కూడా స‌రిపోవ‌డం లేదు. తెలుగులోనూ స్పంద‌న అంతంత‌మాత్రంగా ఉంది. త‌మిళంలో ఓ మోస్త‌రు వ‌సూళ్లు వ‌స్తున్నాయి.

ఐతే థియేట‌ర్ల నుంచి త‌లైవికి ఎంత‌ వ‌సూళ్లు వ‌స్తాయ‌న్న‌ది అంత ముఖ్యం కాద‌ని, థియేట్రిక‌ల్ రిలీజ్ కంటే ముందే తాము లాభాల బాట ప‌ట్టామ‌ని అంటున్నాడు నిర్మాత విష్ణు.
‘‘త‌లైవి సినిమాకు అన్ని వైపులా ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమాపై మేం పెట్టిన డబ్బుల కంటే ఎక్కువే వెనక్కి వచ్చాయి. వ్యాపారపరంగా లాభాలు అందుకున్నాం. నాన్ థియేట్రికల్ రైట్స్‌‌తో బడ్జెట్ మొత్తం రికవరీ అయింది. సినిమాకు పెట్టిన ఖర్చు కంటే ఎక్కువే వచ్చింది. మల్టీప్లెక్స్ అసోసియేషన్ వల్ల థియేటర్ల సమస్య ఏర్పడింది. కానీ నిర్మాతగా నా పరంగా చూస్తే నేను తీసుకున్న నిర్ణయం సరైనదే. ఏ నిర్మాత కూడా తన సినిమాను వారం ముందే అందరికీ చూపించరు. కానీ నేను చూపించాను. నా సినిమా మీద నాకున్న నమ్మకం అదే. ఏ టెన్షన్ లేకుండా రిలీజ్ రోజు హాయిగా నిద్రపోయాను. ఎందుకంటే మేం థియేటర్ రెవెన్యూ మీద ఆధారపడలేదు. ప్ర‌స్తుత స‌మ‌యంలో సినిమా తీయడం కష్టం అనుకుంటే.. రిలీజ్ మ‌రింత కష్టం. మా సినిమాను థియేటర్ కోసమే తీశాం. అందుకే డైరెక్ట్ రిలీజ్ కోసం ఓటీటీ ఆఫ‌ర్లు వ‌చ్చినా.. ఇంత కాలం ఎదురు చూసి థియేట‌ర్ల‌లో రిలీజ్ చేశాం. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో సినిమా హిట్ అయిందా? లేదా? అని బాక్సాఫీస్ లెక్కల్ని పట్టి చెప్పలేం. పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చాయా? లేదా? మన సినిమాను ఎంత ఎక్కువ మంది చూశారు అనేది పరిగణలోకి తీసుకోవాలి. ఆ విషయంలో మేం సక్సెస్ అయ్యాం’’ అని విష్ణు అన్నాడు.