జగన్ నిర్ణయం ఇండస్ట్రీని గ్రిప్‌లో పెట్టుకోవడానికా?

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారం ఇప్పుడో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎన్నడూ లేని విధంగా కొన్ని నెలల కిందట ‘వకీల్ సాబ్’ విడుదల సందర్భంగా ప్రభుత్వం టికెట్ల ధరలపై నియంత్రణ తీసుకురావడం.. అసలే కరోనా ధాటికి సంక్షోభంలో ఉన్న పరిశ్రమ.. ప్రభుత్వ నిర్ణయంతో మరింతగా ఇబ్బందుల్లో పడటం.. ఒక్కసారిగా రెవెన్యూ పడిపోవడంతో పేరున్న కొత్త చిత్రాల విడుదలపై సందిగ్ధత నెలకొనడం తెలిసిందే. టికెట్ల రేట్లతో పాటు ఇతర సమస్యలపై చర్చించడానికి సినీ పెద్దలను ప్రభుత్వం సమావేశానికి పిలిచినా.. ఆ మీటింగ్ ఎంతకీ జరగట్లేదు.

ఈ లోపు ఏపీలో సినిమా టికెట్ల అమ్మకం కోసం ప్రభుత్వమే ఒక బుకింగ్ పోర్టల్ తీసుకురానున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. దీనిపై సినీ జనాలు ఏమీ స్పందించకుండా గుంభనంగా ఉన్నారు. దీని వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమై ఉంటుందా అన్న చర్చలు టాలీవుడ్లో అంతర్గతంగా జరుగుతున్నాయి. ప్రభుత్వమే టికెట్లను అమ్మడం ద్వారా ఇప్పుడున్న టికెట్ బుకింగ్స్ యాప్‌లో మాదిరి ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు ఎక్కువగా ఉండవు. నామమాత్రపు ఛార్జీలతో టికెట్లు బుక్ చేసుకునే సౌలభ్యం కలుగుతుంది. ఇది ప్రేక్షకులకు మంచిదే. కానీ ప్రభుత్వ నిర్ణయం ఇండస్ట్రీని మాత్రం ఒకింత కలవరపాటుకు గురి చేస్తోంది.

ఇండస్ట్రీని గ్రిప్‌లో ఉంచుకోవడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ నుంచి ఏటా భారీ స్థాయిలో సినిమాలు రిలీజవుతున్నప్పటికీ.. అందుకు తగ్గట్లు పన్నులు వసూలు కావట్లేదని.. టికెట్ల అమ్మకాలపై పారదర్శకత లేకపోవడమే దీనికి కారణమని.. ఎగ్జిబిటర్లు దొంగ లెక్కలు చెబుతున్నారని ప్రభుత్వం అనుమానిస్తున్నట్లుగా భావిస్తున్నారు. ప్రభుత్వ యాప్ ద్వారా అమ్మే ప్రతి టికెట్ లెక్కలోకి వస్తుంది కాబట్టి అప్పుడు పక్కాగా పన్ను వసూలు చేయొచ్చని.. పన్ను డబ్బులు మినహాయించుకుని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు రావాల్సింది ప్రభుత్వం తర్వాత ఇస్తుందని అంటున్నారు. ఐతే ప్రభుత్వం నుంచి డబ్బులు వెంటనే అందుతాయా.. ఈ విషయంలో మళ్లీ కమిషన్లు, లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తుతుందా.. ఈ క్రమంలో ఇండస్ట్రీ జుట్టు ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తుందా అన్నది టాలీవుడ్ జనాల ఆందోళన.