ఆర్ఆర్ఆర్.. ఇంతలో ఏం మారిపోయింది?

‘ఆర్ఆర్ఆర్’ మరోసారి వాయిదా పక్కా అన్న విషయం తేలిపోయింది. అక్టోబరు 13న ఈ చిత్రానికి రిలీజ్ డేట్ ఇవ్వగా.. దానికి ఐదు రోజుల ముందు, అంటే అక్టోబరు 8న యువ కథానాయకుడు వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ రూపొందించిన ‘కొండపొలం’ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటన వచ్చింది. నిజంగా ‘ఆర్ఆర్ఆర్’ 13న వచ్చేట్లయితే ‘కొండపొలం’ టీం ఐదు రోజుల ముందు వచ్చే సాహసం చేసేది కాదు. అసలు ‘ఆర్ఆర్ఆర్’ అనుకున్న ప్రకారం రిలీజయ్యేట్లుంటే ఇంకా షూటింగ్‌ దశలో ఉండేది కాదు. ఈపాటికి ప్రమోషన్ హోరెత్తిపోతుండాలి. కాబట్టి ఈ సినిమాను వాయిదా వేయడం ఖాయంగా కనిపిస్తోంది.

త్వరలోనే చిత్ర బృందం ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని వెల్లడించబోతున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ‘ఆర్ఆర్ఆర్’ వాయిదాకు కొన్ని నెలల ముందే అంతా సిద్ధమైపోయి ఉండగా.. అక్టోబరు 13నే ఈ చిత్రం వస్తుందని మళ్లీ మళ్లీ ఎందుకు సంకేతాలు ఇచ్చారన్నదే అర్థం కాని విషయం.

అక్టోబరు 13న ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అని ప్రకటించాక కరోనా సెకండ్ వేవ్ కారణంగా రెండు మూడు నెలలు అన్ని పనులూ ఆగిపోయాయి. దీంతో డెడ్ లైన్ అందుకోవడం కష్టమని తేలిపోయింది. మామూలు సినిమాలకే కష్టం అంటే రాజమౌళి తీస్తున్న పాన్ ఇండియా మూవీ విషయంలో నష్టం భర్తీ చేయడం అంత తేలిక కాదు. కాబట్టి ఈ సినిమా వాయిదా తప్పదని ముందే ప్రేక్షకులు ఓ నిర్ణయానికి వచ్చేశారు. కానీ చిత్ర బృందం మాత్రం ఈ దిశగా సంకేతాలు ఇవ్వలేదు. ఎన్టీఆర్ ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్టోబరు 13నే తమ చిత్రం విడుదలవుతుందని అన్నాడు. ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ టీం రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలో అక్టోబరు 13న రిలీజ్ అంటూ ఘనంగా ప్రకటించారు.

అలాగే ‘ఆర్ఆర్ఆర్’ శాటిలైట్, డిజిటల్ రైట్స్ గురించి రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లలోనూ అదే డేట్ ఇచ్చారు. మేకింగ్ వీడియో వచ్చిన నెల రోజులే అవుతోంది. అప్పుడు అక్టోబరు 13న రిలీజ్ పక్కా అని చెప్పి.. నెల రోజుల్లో ఏం మారిపోయిందని ఇప్పుడు వాయిదా వేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాయిదా అనివార్యమని చాలా ముందే అర్థమైనా, ప్రేక్షకులు కూడా అందుకు మానసికంగా సిద్ధమైపోయినా.. ‘ఆర్ఆర్ఆర్’ టీం ఎందుకు భ్రమలు కల్పించిందన్నదే అర్థం కాని విషయం.