విశ్వక్సేన్.. టాలీవుడ్‌కు చేసిన చేటు


ప్రతి ఒక్కరూ తాము తీసిన సినిమా ఒక కళాఖండం అనే అనుకుంటారు. ఆడియో, ప్రి రిలీజ్ ఈవెంట్లలో.. ప్రమోషన్లలో తమ సినిమా గురించి ఆహా ఓహో అనే చెప్పుకుంటారు. ఐతే సినిమా ఎలా ఉన్నప్పటికీ నెగెటివ్‌గా ఎవ్వరూ చెప్పుకోరు. పాజిటివ్‌గానే మాట్లాడతారు. అంత వరకు ఓకే కానీ.. పెద్దగా విషయం లేని సినిమాను పట్టుకుని అదొక అద్భుతం అని చెప్పుకుంటేనే సమస్య. విడుదల ముందు మరీ హద్దులు దాటి మాట్లాడేస్తే.. తర్వాత సినిమా తేడా కొడితే క్రెడిబిలిటీ అంతా కోల్పోతామన్న స్పృహ చాలామందికి ఉండదు. అందులోనూ మీడియాను ఆకర్షించడానికో, సినిమాకు బజ్ పెంచడానికో ఆ సమయానికి శ్రుతి మించి మాట్లాడితే తర్వాత జరిగే నష్టానికి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ఇప్పుడు యువ కథానాయకుడు విశ్వక్సేన్ ఈ స్థితిలోనే ఉన్నాడు. తన కొత్త చిత్రం ‘పాగల్’ గురించి ప్రి రిలీజ్ ఈవెంట్లో అతను అలా ఇలా మాట్లాడలేదు. మూసుకున్న థియేటర్లు కూడా ఈ చిత్రంతో తెరిపించేస్తా.. అలా జరక్కుంటే పేరు మార్చుకుంటా అంటూ ఓవర్ ద టాప్ స్టేట్మెంట్ ఇచ్చాడతను. ఈ వ్యాఖ్యలతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఓపెనింగ్స్‌కు కొంత వరకు కలిసొచ్చింది. కానీ శని, ఆదివారాలు దాటాక చూస్తే సినిమా నిలబడటం కష్టమవుతోంది. ఈ రోజు థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఆ సంగతలా ఉంచితే.. విశ్వక్ కామెంట్ల వల్ల ఇండస్ట్రీలో మిగతా చిత్రాలకు ఇప్పుడు తలనొప్పి మొదలైంది.

ఎవరైనా తమ సినిమాల గురించి గొప్పలు పోతుంటే.. జనాలు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. శ్రీవిష్ణు పరిస్థితి ఇలాగే తయారైంది. తమ సినిమా ‘రాజ రాజ చోర’ దేశ భాషలన్నింట్లో రీమేక్ అవుతుందని.. సినిమాకు వచ్చేవాళ్లు అరడజను మాస్కులు తెచ్చుకోవాలని.. నవ్వి నవ్వి మూడు మాస్కులు ఎగిరిపోతే.. ఏడ్చి ఏడ్చి మూడు మాస్కులు తడిచిపోతాయని అతను అన్నాడు. దీని మీద నెటిజన్లు కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు. విశ్వక్ మాటల్ని ఉదాహరణగా చూపించి.. ఇప్పుడు విష్ణు వచ్చాడంటూ అతణ్ని ట్రోల్ చేస్తున్నారు. ఒకవేళ ‘రాజ రాజ చోర’ కూడా తేడా కొడితే వీళ్లిద్దరి వ్యాఖ్యల వల్ల మున్ముందు ఎవరినీ నమ్మరేమో. ఎవరు ఏ చిత్రం గురించి గొప్పలు పోయినా జనాలు రివర్సులో అర్థం చేసుకుంటారేమో.