చిరుతో నయన్ ఫిక్స్.. కానీ


మెగాస్టార్ చిరంజీవితో నయనతార మరోసారి స్క్రీన్ పంచుకోబోతుండటం ఖాయమైనట్లే కనిపిస్తోంది. చిరు ఇటీవలే మొదలుపెట్టిన ‘లూసిఫర్’ రీమేక్‌లో కీలక పాత్రకు నయన్ ఎంపికైనట్లుగా తమిళ పీఆర్వోలు పోస్టులు పెట్టారు. ట్విట్టర్లో వెరిఫైడ్ అకౌంట్ల నుంచే ఈ పోస్టులు రావడంతో నయన్ ఈ చిత్రంలో నటించబోతుండటం పక్కా అనుకోవచ్చు. నయన్ ఇంతకుముందే ‘సైరా నరసింహారెడ్డిలో చిరుకు జోడీగా కనిపించింది. ఐతే ఆమె పాత్రకు స్క్రీన్ టైం తక్కువ. నయన్‌ను మించి తమన్నా హైలైట్ అయింది అందులో.

ఐతే ‘లూసిఫర్’ రీమేక్‌లో మాత్రం నయన్‌ది సినిమా అంతటా కనిపించే కీలకమైన పాత్రే. ‘లూసిఫర్’లో ఈ పాత్రను మంజు వారియర్ చేసింది. అందులో హీరోకు ఆమె వరుసకైతే చెల్లెలు అవుతుంది. హీరోను దత్త పుత్రుడిగా భావించే పెద్ద మనిషికి ఆమె కూతురు అవుతుంది. రక్త సంబంధం లేకున్నప్పటికీ అందులో హీరో, ఆ పాత్రధారి అన్నా చెల్లెళ్లనే ఫీలింగే కలుగుతుంది. ఐతే ‘సైరా’లో భార్యాభర్తలుగా కనిపించిన చిరు-నయన్‌లను ఇప్పుడు అన్నా చెల్లెళ్ల తరహా పాత్రల్లో చూసి ప్రేక్షకులు జీర్ణించుకోగలరా అన్నది సందేహం.

తెలుగు ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని ఈ పాత్రలో దర్శకుడు మోహన్ రాజా ఏమైనా మార్పులు చేసి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరుకు నయన్ జోడీగా కనిపించకపోయినా.. చెల్లెలిగా మాత్రం వద్దని మెజారిటీ తెలుగు ప్రేక్షకులు కోరుకుంటారనడంలో సందేహం లేదు. మరి మోహన్ రాజా నయన్ పాత్రను ఎలా డిజైన్ చేశాడో చూడాలి. రీమేక్‌లు తీయడంలో మోహన్ రాజా ప్రత్యేకతే వేరు. తెలుగులో చేసిన ‘హనుమాన్ జంక్షన్’ మాత్రమే కాక.. తమిళంలో జయం, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, బొమ్మరిల్లు లాంటి రీమేక్‌లతో అతను భారీ విజయాలందుకున్నాడు. మరి ‘లూసిఫర్’ను తెలుగులో అతనెలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.