ప‌వ‌న్‌తో అనుకుంటే అత‌డితో చేస్తోంది

Manasa

మాన‌స రాధాకృష్ణ‌న్.. పేరు చూస్తేనే ఇది తెలుగ‌మ్మాయి పేరు కాద‌ని అర్థ‌మైపోతుంది. మ‌ల‌యాళంలో చిన్న స్థాయి హీరోయిన్ ఈమె. ఐతే అనుకోకుండా ఈ అమ్మాయి పేరును తెలుగు ప్రేక్ష‌కులు ట్రెండ్ చేయ‌డం మొద‌లుపెట్టారు గ‌త ఏడాది.

అందుక్కార‌ణం.. మాన‌స ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో క‌థానాయిక‌గా చేస్తోంద‌ని జ‌రిగిన ప్ర‌చార‌మే. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ చేయ‌నున్న సినిమాలో ఈ అమ్మాయే హీరోయిన్ అంటూ గ‌ట్టిగానే ప్ర‌చారం సాగింది. కానీ అది నిజం కాద‌ని హ‌రీష్ స్వ‌యంగా వెల్ల‌డించాడు.

ఆ త‌ర్వాత మాన‌స సైతం ఈ ప్ర‌చారాన్ని ఖండించింది. అంత‌టితో ఆమె పేరు ప‌క్క‌కు వెళ్లిపోయింది. ఐతే ఇప్పుడామె నిజంగానే టాలీవుడ్లో అరంగేట్రం చేస్తుండ‌టం విశేషం. కానీ ఇంత‌కుముందు అనుకున్న‌ట్లు ఆమె ఎంట్రీ ఇస్తోంది ప‌వ‌న్ సినిమాతో కాదు.

విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా టాలీవుడ్లోకి అడుగు పెడుతోంది మాన‌స‌. హైవే పేరుతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం బుధ‌వార‌మే మొద‌లైంది. 118 చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారిన సీనియ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

118 త‌ర్వాత గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో డ‌బ్ల్యూడ‌బ్ల్యూడ‌బ్ల్యూ పేరుతో మ‌రో థ్రిల్ల‌ర్ తీశాడు. అది విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అది పూర్తి కాగానే ఆనంద్-మాన‌స జోడీగా హైవే చిత్రాన్ని మొద‌లుపెట్టాడు. ఇది కూడా థ్రిల్ల‌ర్ మూవీనే అట‌. హైవేలో హ‌త్య‌ల నేప‌థ్యంలో ఈ క‌థ న‌డుస్తుంద‌ట‌.

దీని త‌ర్వాతి చిత్రానికి కూడా గుహ‌న్ రంగం సిద్ధం చేశాడు. 118 హీరో క‌ళ్యాణ్ రామ్‌తో మ‌రో థ్రిల్ల‌ర్ తీయ‌బోతున్నాడు. దిల్ రాజు ఆ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడు. ఆనంద్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే పుష్ప‌క విమానం చిత్రంతో ప‌ల‌క‌రించ‌నున్న సంగ‌తి తెలిసిందే.