ఓటీటీ అమ్మకాలపై నిర్మాత ఫైర్!

కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్లుగా సినీ ఇండస్ట్రీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. లాక్ డౌన్ కారణంగా థియేటర్లను క్లోజ్ చేసేశారు. గతేడాది నుండి థియేటర్ వ్యవస్థ పరిస్థితులు దారుణంగా మారాయి. ఈ ఏడాది ఆరంభంలో మళ్లీ థియేటర్లు తెరుచుకోవడంతో పరిస్థితి మెరుగుపడుతుందని భావించారు. కానీ సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. ఓ పక్క థియేటర్లు తెరుచుకోవడం లేదని.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతుంటే మరోపక్క నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలకు అమ్మేస్తున్నారు.

భారీ మొత్తాలను ఆఫర్ చేస్తూ చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలను ఓటీటీ సంస్థలు దక్కించుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలను కూడా ఓటీటీ సంస్థలు గాలం వేస్తున్నాయి. వెంకటేష్ నటించిన ‘నారప్ప’ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు నిర్మించిన సినిమా ఇప్పుడు ఓటీటీకు వెళ్తుందని తెలుసుకున్న ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా వీరంతా కలిసి మీడియా ముందుకు వచ్చాయి. ఈ సందర్భంగా సునీల్ నారంగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన పరోక్షంగా సురేష్ బాబుని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. చిన్న నిర్మాతలు తమ సినిమాలను అమ్ముకున్నారంటే పర్వాలేదు కానీ ఇలా పెద్ద వాళ్లు కూడా అమ్ముకోవడం ఏంటంటూ ప్రశ్నించారు. తాను కూడా నిర్మాతనే అని.. నిర్మాతకు ఉండే కష్టాలు తెలుసని అన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికంటే ఎక్కువగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నారని.. దయచేసి సినిమాను, థియేటర్లను కాపాడాలని సునీల్ నారంగ్ రిక్వెస్ట్ చేశారు. ఇండస్ట్రీలోని నిర్మాతలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానని.. అక్టోబర్ 30 వరకు తమ సినిమాలను ఓటీటీలను అమ్మొద్దని వేడుకున్నారు. అప్పటికి పరిస్థితులు చక్కబడకపోతే అప్పుడు ఓటీటీలకు అమ్ముకోవాలని చెప్పారు.