పవన్, నిత్య కలిసి ఒకేసారి..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు నెలలకు పైగా హైదరాబాద్ శివార్లలోని తన ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు. ఆయన కరోనా బారిన పడటం.. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకుంటుండటంతో రాజకీయ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉన్నారు. ఇక షూటింగ్‌ల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గి గత నెలలోనే ఒక్కో చిత్ర బృందం తిరిగి షూటింగ్‌ మొదలుపెట్టగా.. పవన్ మాత్రం తన కొత్త చిత్రాలను ఇంకా పున:ప్రారంభించలేదు.

ఐతే ఎట్టకేలకు పవన్ మళ్లీ షూటింగ్‌ మోడ్‌లోకి వెళ్లబోతున్నాడు. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఆయన తిరిగి మొదలుపెట్టబోయే చిత్రం ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్. ఈ నెల 12న ఈ చిత్ర కొత్త షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నారు. హైదరాబాద్ శివార్లలోనే ఈ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో నిత్యా మీనన్ కూడా సెట్స్‌లోకి అడుగు పెట్టనుండటం విశేషం.

ఒరిజినల్లో గౌరి నంద చేసిన పాత్రను తెలుగులో సాయిపల్లవితో చేయించాలని ముందు అనుకున్నారు. ఆమె ఈ పాత్రకు ముందు ఒప్పుకుని, తర్వాత డేట్లు ఖాళీ లేక ఈ సినిమా నుంచి తప్పుకుంది. తర్వాత నిత్యా మీనన్‌ను అడగడం, ఆమె ఓకే చెప్పడం జరిగాయి. ఐతే కరోనా కారణంగా ఆమె ఇప్పటిదాకా చిత్ర బృందంతో కలవలేదు. ఎట్టకేలకు ఈ నెల 12న ఈ సినిమాలోకి అడుగు పెడుతోంది.

పవన్, నిత్యామీనన్ జోడీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటిదాకా వీళ్లిద్దరూ కలిసి నటించలేదు. ఎక్కువగా యువ కథానాయకులతోనే చేసిన నిత్య.. తొలిసారి తెలుగులో ఓ సీనియర్ హీరోతో జోడీ కడుతోంది. పవన్ కొన్ని రోజులు ఈ చిత్రానికి పని చేశాక.. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీర మల్లు’ షూటింగ్‌ను పున:ప్రారంభిస్తాడు. ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాదే రిలీజ్ చేయాన్నది నిర్మాతల ఆలోచన. ‘హరిహర వీరమల్లు’ను వచ్చే సంక్రాంతికి అనుకుంటున్నారు కానీ.. ఆ డేట్‌‌ను అందుకోవడం సందేహంగానే ఉంది.