పవన్ కోసం రీమేక్‌ను అలా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ చిత్రాల్లో ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ ఒకటి. మలయాళంలో గత ఏడాది ఆరంభంలో విడుదలైన ‘అయ్యప్పనుం..’ పెద్ద హిట్టే అయింది. సరిగ్గా లాక్ డౌన్ మొదలైన సమయంలో అమేజాన్ ప్రైమ్‌లో విడుదల కావడం, మంచి టాక్ ఉండటంతో మలయాళీలే కాక వివిధ భాషల వాళ్లు ఈ సినిమాను విరగబడి చూశారు. మన వాళ్లకు కూడా ఇది బాగానే నచ్చింది.

కాకపోతే ఈ సినిమా లెంగ్త్ ఎక్కువ, కొంచెం నెమ్మదిగా సాగుతుందనే విమర్శలు కొంతమేర వచ్చాయి. వాటిని తెలుగులో ఏమేర కరెక్ట్ చేస్తారన్నది కీలకం. అలాగే ఒరిజినల్లో పాత్రలు బలంగానే కనిపించినా.. బిజు మీనన్ పాత్రకు ఇంకా ఎలివేషన్ ఇచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. తెలుగులో ఆ పాత్రను చేస్తున్నది పవన్ కళ్యాణ్ కావడంతో ఇక్కడ ఎలివేషన్లు కచ్చితంగా ఆశిస్తారు.

ఐతే అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లే ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌లో మార్పులు చేసినట్లు సమాచారం. పవన్ పాత్రను మరింత పవర్ ఫుల్‌గా తయారు చేశాడట ఈ చిత్రానికి రచన చేసిన త్రివిక్రమ్. ఒరిజినల్‌తో పోలిస్తే ఇందులో యాక్షన్ ఎక్కువ ఉంటుందని.. మొత్తంగా నాలుగు యాక్షన్ బ్లాక్స్ పెట్టారని సమాచారం. మాతృకలో పూర్తి స్థాయి యాక్షన్ సీన్ క్లైమాక్స్‌లో మాత్రమే వస్తుంది. అంతకుముందు అలాంటి యాక్షన్ ఘట్టాలుండవు. ఐతే రీమేక్‌లో అదనపు సీన్లు జోడించి యాక్షన్‌కు ఎక్కువ స్కోప్ ఉండేలా చూస్తున్నారట.

అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాల ఫేమ్ సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. కరోనా కారణంగా వచ్చిన విరామం తర్వాత కొన్ని రోజుల్లోనే ఈ చిత్రం కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. ఇందులో పవన్ సరసన నిత్యామీనన్ నటించనున్నట్లు తెలుస్తోంది. రానాకు జోడీగా ఐశ్వర్యా రాజేష్ ఇప్పటికే ఖరారైన సంగతి తెలిసిందే.