మనోజ్.. సీక్రెట్‌గా ఏదో చేస్తున్నాడు

మంచు మనోజ్ కెరీర్లో ఊహించని విధంగా రెండేళ్ల విరామం వచ్చేసింది. ‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత అతను సినిమానే చేయలేదు. ఎట్టకేలకు ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. మధ్యలో అతడి మాటలు, చర్యలు చూస్తే సినిమాలు పూర్తిగా మానేస్తాడేమో అనిపించింది. రాజకీయాల్లోకి వస్తాడన్న ఊహాగానాలు వినిపించాయి.
కొంతకాలం హైదరాబాద్ విడిచిపెట్టి.. తిరుపతిలోనూ ఉంటూ కొన్ని సేవా కార్యక్రమాలేవో చేపట్టాడు మనోజ్. తర్వాత మళ్లీ హైదరాబాద్ వచ్చి సినిమాలపై దృష్టి పెట్టాడు. ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాను ఓకే చేశాడు. దాని కోసం చాలానే కష్టపడుతున్నాడు. ఇదిలా ఉంటే.. సినిమాలా.. రాజకీయాలా.. ఇంకొకటా అని చెప్పకుండా తనకో డ్రీమ్ ప్రాజెక్టు ఉన్నట్లుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు మనోజ్.

ఆ డ్రీమ్ ప్రాజెక్టు చాలా పెద్దదని.. దాని ఫలితాలు గొప్పగా ఉంటాయని.. ఇప్పటికే ఆ డ్రీమ్ ప్రాజెక్టు హైదరాబాద్‌లో మొదలుపెట్టానని.. దాన్ని తర్వాత తిరుపతికి విస్తరిస్తానని.. ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు కూడా విస్తరిస్తానని చెప్పాడు మనోజ్. దాని గురించి వివరాలు చెప్పడానికి మనోజ్ ఇష్టపడలేదు. వచ్చే ఏడాది దాని గురించి వెల్లడిస్తానని మనోజ్ చెప్పాడు. ఇంతకీ రాజకీయాల సంగతేంటి అని మనోజ్‌ను అడిగితే.. తనకు వాటిపై ఆసక్తి లేదని తేల్చేశాడు మనోజ్. ఇంతకుముందు తిరుపతికి వెళ్లి తాను చేపట్టిన కార్యక్రమం కూడా రాజకీయాలతో సంబంధం లేనిదే అని అతను తెలిపాడు.

తన కొత్త సినిమా ‘అహం బ్రహ్మాస్మి’తో ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇవ్వబోతున్నట్లు చెప్పిన మనోజ్.. సినిమాల నుంచి రెండేళ్లు విరామం తీసుకోవడానికి ఫెయిల్యూర్లు ఎంతమాత్రం కారణం కాదని, వ్యక్తిగత కారణాల వల్లే ఈ గ్యాప్ తీసుకున్నానని మనోజ్ స్పష్టం చేశాడు. ఓటీటీల వల్ల సినీ పరిశ్రమకు మంచిదే అని మనోజ్ అభిప్రాయపడ్డాడు.